అలనాటి మేటి నటీమణి జమున పాత్రలో అందాల అనుష్క నటించబోతోందట. కొన్ని విలక్షణ పాత్రలకు అనుష్క తప్ప దర్శక నిర్మాతలకు ఇంకో ఆప్షన్ కనిపించడంలేదు. 'అరుంధతి' సినిమా నుంచి 'బాహుబలి' దాకా అనుష్క ఓ కొత్త పంథాలో పయనిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె నుంచి 'సైజ్ జీరో' అనే ప్రయోగాత్మక చిత్రం కూడా వచ్చింది. అంతటి సాహసం ఈ తరం హీరోయిన్లలో ఇంకెవరూ చేయలేరు. అయితే ఆ సినిమా ఆశించిన విజయం అందుకోకపోయినా కానీ, అనుష్క సాహసాన్ని, ఆమె పడిన కష్టాన్ని గురించి మాట్లాడుకోకుండా ఎవ్వరూ ఉండలేరు. మరి కొద్ది రోజుల్లోనే 'బాహుబలి ది కన్క్లూజన్' సినిమాతో మన ముందుకు రాబోతున్న స్వీటీ బ్యూటీ నటిస్తోన్న జమున పాత్ర విషయానికి వస్తే, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో 'సావిత్రి' అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసినదే కదా. ఆ సినిమాలోనే జమున పాత్రలో అనుష్కని ఎంపిక చేశారట. మరో ముఖ్యమైన పాత్రకుగాను సమంతని ఇప్పటికే ఎంపిక చేయడం జరిగింది. మహానటి సావిత్రి జీవిత చరిత్రను 'సావిత్రి' పేరుతో సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అలనాటి మేటి నటీమణుల గురించి ప్రస్తావన ఉండనుంది. అందుకు గానూ నేటి నటీమణుల్లో కీర్తి సురేష్కి కీ రోల్ సావిత్రి పాత్రలో నటించే అదృష్టం దక్కగా, తాజాగా ఈ సినిమాకి అనుష్కని ఎంపిక చేయడంతో, సినిమాకి స్టార్ వాల్యూ అద్దినట్లయ్యింది.