మెగాస్టార్ రీ ఎంట్రీలో 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో వచ్చి బాక్సాఫీస్ని షేక్ చేసేశారు. కలెక్షన్ల వరదనే సృష్టించారు. 150వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం తర్వాత చిరంజీవి చేస్తున్న మూవీ 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి'. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అంటే ఓ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. కానీ మహాత్మగాంధీ తదితర స్వాతంత్ర సమరయోధుల్లా ఆయన పేరు అంతగా పాపులర్ కాలేదు. ఆయనదో మరుగున పడిపోయిన చరిత్ర. స్వాతంత్య్రం కోసం అతి దారుణంగా ప్రాణాలు కోల్పోయిన గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి జీవిత గాధలో చిరంజీవి నటించబోతున్నారు. ఈ సినిమా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక టీమ్ ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ని గేదర్ చేసింది. చరిత్ర అంతరాలంలోకి వెళ్లి నిజా నిజాలను సేకరించింది. ఈ సేకరణలో భాగమే ఉయ్యాలవాడ ఎలా చనిపోయారనేది? ఆయన తల నరికి ముఖ ద్వారానికి వేలాడదీశారు ఆంగ్లేయులు. మరి ఈ చరిత్రని తెరకెక్కిచేటప్పుడు ఎండింగ్ కూడా ఆ రకంగానే ఉండాలి. లేదంటే చరిత్రని వక్రీకరించినట్లు అవుతుంది. అయితే హీరో పాత్రలో నటిస్తున్న చిరంజీవిని చంపేస్తే అభిమానులు అస్సలు తట్టుకోలేరు. మరి ఈ సినిమాకి ఎండింగ్ ఎలా ఇస్తారనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాత కాగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ని సురేందర్ రెడ్డి ఎలా మేనేజ్ చేస్తాడనేది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది.