బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కుతోన్న చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి'. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా శాతవాహనుల పతాక ఆవిష్కరణ దినోత్సవం జరపనున్నారట. జనవరి 8న ఈ వేడుక జరగనుందట. 100 ధియేటర్లలో ఈ పతాక ఆవిష్కరణ జరగనుందట. ఈ జెండాను ఆవిష్కరించడంలో అంతరార్దం సినిమాకి విజయ సూచికను తెలియజేయడమే. పోరుకు సిద్ధం అని. వైజాగ్లోని జ్యోతి ధియేటర్లో ఈ పతాక ఆవిష్కరణ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరగనుండగా, మిగిలిన లొకేషన్స్లో బాలయ్య అభిమానులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ట్రైలర్, ఆడియో రిలీజ్ ఫంక్షన్లు ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు ఈ పతాక ఆవిష్కరణ కొత్తగా ఉంది. సినిమా శాతవాహన రాజు 'శాతకర్ణి'కి సంబంధించిన స్టోరీ కాబట్టి, అందుకు తగ్గట్లుగానే ప్రతీ సాంప్రదాయాన్ని పక్కాగా ఫాలో చేస్తున్నారు. శ్రియ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ హేమామాలిని కీలక పాత్రలో కనిపించారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా గెస్ట్ రోల్లో నటించారు. తెలుగు వారు తెలుసుకుని, గర్వపడాల్సిన గొప్ప చరిత్ర శాతకర్ణిది. అలాంటి చరిత్రని క్రిష్, బాలయ్య పుణ్యమా అని తెలుగు వారందరికీ అర్ధమయ్యే రీతిలో తెరపై ఆవిష్కృతం కానుంది ఈ సినిమా ద్వారా. వీక్షించి తరించడానికి ఎన్నో రోజుల దూరం లేదు.