'పైసా వసూల్' సినిమా అంటే ఓన్లీ మాస్ మసాలా యాక్షన్ మూవీ అనుకున్నారంతా ఇంతవరకూ వచ్చిన టీజర్స్ నుండి. కానీ ఈ సినిమాలోని రొమాంటిక్ యాంగిల్ని కూడా చూపించేశాడు డైరెెక్టర్ పూరీ జగన్నాధ్. తాజాగా ఈ సినిమా నుండి ఓ మెలోడి సాంగ్ బయటికి వచ్చింది. 'కన్ను కన్ను కలిశాయి..' అంటూ సాగే ఈ పాట టీజర్తో సహా విడుదల చేశాడు పూరీ జగన్నాధ్. యూనిట్ సభ్యులంతా ఈ సాంగ్ టీజర్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. సాంగ్ విజువల్స్ చూస్తుంటే, పూరీ గొప్పతనం చెప్పుకోకుండా ఉండలేము. భారీ భారీ లొకేషన్స్ని లాంగ్ వ్యూలో చూపిస్తూనే, ముద్దుగుమ్మ శ్రియ అందాలను కూడా ఎంతో అందంగా చూపించాడు. అలాగే ఆ సాంగ్ టీజర్లో బాలయ్య, శ్రియ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ కొంచెం సేపు టీజర్లోనే పూరీ ఇన్ని అందమైన లొకేషన్స్ చూపించేశాడు. ఇక సినిమాలో ఇంకెన్ని అందమైన లొకేషన్స్ చూపిస్తాడో! యాక్షన్ సీన్స్, భారీ భారీ డైలాగ్స్ ఇరగదీసేసిన బాలయ్య కూల్ అండ్ రొమాంటిక్ లుక్స్లో కనిపిస్తూ, ఫ్యాన్స్కి కిర్రాక్ తెప్పిస్తున్నారు. శ్రియకి బాలయ్యతో ఇది మూడో సినిమా. గతేడాది విడుదలైన 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాలో 'శాతకర్ణి' భార్యగా క్లాసికల్ లుక్లో కనిపించిన శ్రియ ఈ సినిమాలో గ్లామరస్ లుక్లోకి మారిపోయింది. శ్రియతో పాటు ముస్కాన్, కైరాదత్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 1న 'పైసా వసూల్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.