వినాయక్‌ డైరెక్షన్‌లో నల్లమలుపు బుజ్జి సినిమా

మరిన్ని వార్తలు

వినాయక్‌ డైరెక్షన్‌లో కొత్త సినిమా ఖరారయ్యింది. నల్లమలుపు బుజ్జి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. వినాయక్‌కి, నల్లమలుపు బుజ్జి అత్యంత సన్నిహితుడు. గతంలో వినాయక్‌ దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు నల్లమలుపు బుజ్జి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీ' మంచి విజయం అందుకుంది. వెంకటేష్‌ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. కాగా తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది. 

అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఓ ప్రముఖ హీరో ఈ సినిమాలో నటించనున్నాడనీ సమాచారమ్‌. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి చేయనున్నారు. నంది అవార్డుల వివాదం విషయమై నల్లమలుపు బుజ్జి ఈ మధ్య వార్తల్లోకెక్కారు. తన నిర్మాణంలో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ మూవీ 'రేసుగుర్రం' నంది అవార్డుల లిస్టులో లేనందుకు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన మీడియా ముందుకొచ్చారు. ఆ రకంగా నల్లమలుపు బుజ్జి ఈ మధ్య చర్చల్లో హాట్‌ టాపిక్‌ అయ్యారు. కాగా వినాయక్‌ ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. మంచి యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ ఈ సినిమా. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. 

'అఖిల్‌' సినిమా ఫెయిల్యూర్‌తో వినాయక్‌ అనేక విమర్శలు అందుకున్నారు. మళ్లీ బాస్‌ మెగాస్టార్‌ 150వ చిత్రంతో బౌన్స్‌ బ్యాక్‌ అయ్యారు. 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా వినాయక్‌ని మళ్లీ రేసులో ముందు స్థానంలో నిలబెట్టింది. 'అఖిల్‌' ఫెయిల్యూర్‌ ఉన్నప్పటికీ, వినాయక్‌పై ఉన్న నమ్మకంతో చిరంజీవి తన రీ ఎంట్రీ మూవీని వినాయక్‌ చేతిలో పెట్టాడు. రామ్‌ చరణ్‌ నిర్మాణంలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత వినాయక్‌ చేయబోతున్న సినిమా మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌తోనే. ఈ సినిమా పూర్తి కాగానే నల్లమలుపు బుజ్జితో కొత్త ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించనున్నాడు వినాయక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS