‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సినిమాల గ్రాఫ్ మరో స్థాయికి వెళ్ళింది. ఆయన చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీగా తీర్చిదిద్దేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు పెడుతున్నారు. అలా భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటోన్న ప్రభాస్ చిత్రాల్లో ఒకటి ‘ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించారు. బాలీవుడ్ నటి కృతిసనన్ సీత పాత్రలో కనిపించగా,నటుడు సైఫ్ అలీఖాన్ లంకేశుడిగా కనిపిస్తున్నారు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబధించిన ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఏకంగా 250కోట్లకు కొనుగోలు చేసిందని టాక్. ఇదే ఒక వేళ నిజమైతే ఒక ఇండియన్ సినిమా ఇంత పెద్ద మొత్తంలో డిజిటల్ హక్కులు సొంతం చేసుకోవడం ‘ఆదిపురుష్’ కే దక్కుతుంది. ఈ సినిమా మొత్తం బడ్జెట్ విలువ రూ.400 కోట్లని సమాచారం. దాదాపు 15 స్వదేశీ, అంతర్జాతీయ భాషల్లో.. ప్రపంచవ్యాప్తంగా 20,000 థియేటర్లలో ఒకేసారి ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.