ఎన్టీఆర్ అభిమానులకూ - మీరా చోప్రాకీ మధ్య సోషల్ మీడియాలో చిన్న సైజు యుద్ధమే జరుగుతోంది. `నేను ఎన్టీఆర్ అభిమానిని కాదు` అని ఓ చిట్ చాట్ లో మీరా చోప్రా చెప్పడంతో అసలు రగడ మొదలైంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్... మీరాని బండ బూతులు తిట్టడం మొదలెట్టారు. చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. దీనిపై మీరా చోప్రా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో మీరా చోప్రాకి కావల్సినంత మద్దతు లభిస్తోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దే తప్పు అంటూ నెటిజన్లు మీరాకు బాసటగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటి ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
``కొంతమంది ఆడవాళ్లు అంతే. మారరు. నేర్చుకోరు.`` అంటూ ఓ ట్వీట్ చేసింది ఆమె. ఇది మీరాని ఉద్దేశించి చేసిన ట్వీటే అని నెటిజన్లు అనుకుంటున్నారు. దానికి కారణం ఉంది. ఖుష్బూ ఎన్టీఆర్కి వీరాభిమాని. ఈ విషయాన్ని ఇటీవలే ఖుష్బూ బయటపెట్టింది. ఆ అభిమానంతో పరోక్షంగా ట్వీట్ చేసి, ఎన్టీఆర్ కీ, ఆయన ఫ్యాన్స్కీ అండగా నిలబడిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకూ నిజమో తెలీదు గానీ, ఈ తాజా ట్వీటు తో ఖుష్బూ కూడా ఈ వివాదంలో తల దూర్చినట్టైంది.