మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మా అసోసియేషన్ అధ్యక్షునిగా నరేష్ని ఇతర సభ్యులు జీర్ణించుకోవడం లేదు. ఆయన తీరుపై అనేక ఆరోపణలు చేస్తూ ఎప్పటికప్పుడు మా అసోసియేషన్ పరువును రచ్చకీడ్చుతూనే ఉన్నారు. తాజాగా ఈసీ సభ్యులు అధ్యక్షుడు నరేష్ తీరును తప్పు పడుతూ 9 పేజీల లేఖతో క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేశారు. మాజీ మా అధ్యక్షుడు శివాజీ రాజాపై నరేష్ ఇంకా అనవసరపు ఆరోపణలు చేస్తున్నారంటూ వారు ఈ లేఖలో పేర్కొన్నారు. అలాగే, ఈసీ సభ్యులను సంప్రదించకుండానే ఏకపక్షంగా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారనీ, సభ్యుల బాగోగులు, అనారోగ్య పరిస్థితుల్ని అస్సలేమాత్రం పట్టించుకోవడం లేదనీ, మా అసోసియేషన్ అభివృద్దికి పెద్ద అడ్డంకిగా మారారనీ వారు ఆ లేఖలో పేర్కొన్నారు.
అంతేకాదు, నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణ కూడా ఉంది. ఇటీవలే 'మా'లో జరుగుతున్న గొడవల్ని చక్కదిద్దే క్రమంలో మా వ్యవస్థాపకులు పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. 'మా'లోని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుక్కునే దిశగా ఓ ప్రత్యేక కమిటీని వేసి, తెర వెనుక విచారణ జరుపుతున్నారన్న సమాచారం ఉంది. ఈలోగానే ఈసీ సభ్యులు రాసిన తాజా 9 పేజీల లేఖ ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీలో ప్రకంపనలుకు దారి తీసింది.