బాలీవుడ్లో తెరకెక్కుతోన్న 'రాబ్తా' సినిమా మన తెలుగు సినిమా 'మగధీర'కి ఫ్రీమేక్. ట్రైలర్ చూసినవారికి ఈజీగా అది అర్థమయిపోయింది. సీన్స్ యధాతథంగా కాపీ కొట్టేశారు ఈ సినిమాకి. దాంతో సోషల్ మీడియాలో 'రాబ్తా' టీమ్పై 'మగధీర' అభిమానులు విరుచుకుపడ్డారు. ఇలా జరగడంతో 'మగధీర' చిత్ర నిర్మాతలు అలర్ట్ అయ్యారు. గీతా ఆర్ట్స్ తరఫున 'రాబ్తా' టీమ్కి నోటీసులు పంపారు న్యాయస్థానం ద్వారా. అయితే ఈ నోటీసులపై స్పందించిన 'రాబ్తా' చిత్ర నిర్మాతలు, క్రియేటివిటీని 'కాపీ' అంటారా? అని విరుచుకుపడ్డారు. ట్రైలర్ చూసి, కాపీ అనేయడం సబబు కాదని ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. అరతే కాదు లీగల్ నోటీసులు అందలేదని వారు పేర్కొనడం ఆశ్చర్యకరంగా ఉంది. న్యాయస్థానంలో 'మగధీర' నిర్మాతలు అధికారికంగా కేసు నమోదు చేశారు. అలాంటిది లీగల్ నోటీసులు అందలేదనీ 'రాబ్తా' నిర్మాతలు బాధ్యతా రహితంగా సమాధానం చెప్పడంతో ఈ వివాదం గట్టిపడేలా ఉంది. సినిమా కాపీ రైట్స్ హక్కులు తీసుకోకుండా, ఓ సినిమాని రీమేక్ చేసే అధికారం లేదు సినీ రంగంలో . అలాంటిది 'రాబ్తా' సినిమా విషయంలో ఎందుకిలా జరిగింది? ఈ సినిమా జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఈ వివాదాలతో సినిమా విడుదలను నిలిపేస్తారా? లేక కొనసాగిస్తారా? ఏం జరుగుతుందో చూడాలి మరి. '1 - నేనొక్కడినే' భామ కృతిసనన్ హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో.