మణిరత్నం దిగ్గజ దర్శకుడు. క్లాసిక్స్ తీశాడు. ఇందులో డౌటు లేదు. కానీ కొన్నేళ్లుగా హిట్ అనే పదాన్నే వినలేకపోయాడు మణి. తన నుంచి వచ్చినవన్నీ డిజాస్టర్లే. ఇక మణిరత్నం టైమ్ అయిపోయింది అనుకొంటున్న దశలో.. పొన్నియన్ సెల్వన్ వచ్చింది. మణిరత్నాన్ని నిలబెట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లు సాధించిందని చిత్ర బృందమే స్వయంగా ప్రకటించింది. ఇప్పుడు పార్ట్ 2 కూడా వస్తోంది. ఏప్రిల్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే.. ఇప్పుడు ఈ సినిమాతో మణి కష్టాలు మళ్లీ మొదటకు వచ్చాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన ఈ చిత్రాన్ని తమిళంలో మినహాయిస్తే ఎక్కడా మార్కెట్ జరగలేదు. అన్ని భాషల్లోనూ ఈ సినిమాని కొనే బయ్యర్లే కరువయ్యారు.
పొన్నియన్ సెల్వన్ హిట్టే. కాకపోతే.. తమిళ వాసులే ఈ సినిమాని ఓన్ చేసుకొన్నారు. తెలుగులో రూ.10 కోట్లకు ఈ సినిమా కొన్నారు. ఆ డబ్బులు బొటాబొటీగా, చాలా కష్టపడి వెనక్కి వచ్చాయి. చాలా చోట్ల బయ్యర్లు నష్టపోయారు. కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఇదే పరిస్థితి. తమిళ వాసులు ఈ సినిమాని సెంటిమెంట్ గా భావించారు. తమ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం అనుకొన్నారు. వాళ్లు ఈ సినిమాని నెత్తిమీద పెట్టుకొన్నా మిగిలిన వాళ్లకు ఎక్కలేదు. ఆ కథేంటో, పాత్రేమిటో ఎవ్వరికీ అర్థం కాలేదు. అందుకే పార్ట్ 1 అంతంత మాత్రంగానే చూశారు. అలాంటప్పుడు పార్ట్ 2కి ఆదరణ ఎలా ఉంటుంది..? అందుకే ఈ సినిమాని కొనడానికి బయ్యర్లు సిద్ధంగా లేరు. మణిరత్నం లాంటి దర్శకుడు ఓ హిట్టు కొట్టాక కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా గట్టెక్కాలంటే తమిళనాట కనీసం రూ.150 కోట్లయినా తెచ్చుకోవాలి. మరి అది సాధ్యమేనా అనేదే పెద్ద ప్రశ్న.