అల వైకుంఠపురములో అంటూ... 2020లో సందడి చేశాడు అల్లు అర్జున్. 2021 సంక్రాంతికీ బన్నీ సినిమా వస్తుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ కరోనా అందరి ఆశలకూ గండి కొట్టేసింది. దాంతో 2021 సంక్రాంతి సీజన్ బన్నీ చేతుల్లోంచి జారిపోయింది. వేసవిలోనూ `పుష్ఫ` వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. అయితే... 2021లోనే `పుష్ష`ని చూడొచ్చు. ఎందుకంటే చిత్రబృందం రిలీజ్ డేట్ పక్కా చేసేసింది. ఈ సినిమాని ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. రష్మిక కథానాయికగా నటిస్తున్న చిత్రమిది. అటవీ నేపథ్యంలో సాగుతుంది.
ఎర్ర చందనం స్మగ్లర్ గా బన్నీ నటించబోతున్నాడు. ప్రస్తుతం మారేడుమల్లి అడవుల్లో చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో ఓ సెట్ వేశారు. ఫిబ్రవరిలో ఈ సెట్లో షూటింగ్ జరగబోతోంది. మార్చిలో... చిత్రబృందం కేరళ వెళ్తుంది. ఆ తరవాత పాటలు తెరకెక్కిస్తారు. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.