దర్శక ధీరుడి ప్రశంసలందుకున్న కమెడియన్‌.!

మరిన్ని వార్తలు

కమెడియన్‌గా పలు చిత్రాలతో ఆకట్టుకుంటున్న శ్రీనివాస్‌ రెడ్డి దర్శక, నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం 'భాగ్య నగర వీధుల్లో గమ్మత్తు'. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ని మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆడియన్స్‌తో పాటు, పలువురు సినీ ప్రముఖులు కూడా ట్రైలర్‌ చాలా బాగుందంటూ, శ్రీనివాస్‌రెడ్డిని అభినందించారు.

 

ఇక తాజాగా జక్కన్న రాజమౌళి నుండి కూడా మంచి ప్రశంసలు అందుకున్నాడు శ్రీనివాస్‌ రెడ్డి. ప్రశంసలందు జక్కన్న ప్రశంసలు వేరయా.. అన్నట్లుగా దర్శక ధీరుడి ప్రశంసలతో శ్రీనివాస్‌ రెడ్డిలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. కమెడియన్‌గా సక్సెస్‌ అయిన శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా వచ్చిన 'జయమ్ము నిశ్చయమ్మురా', 'జంబలకిడి పంబ' చిత్రాలు విజయవంతమయ్యాయి. ఇక ఇప్పుడు దర్శక, నిర్మాతగానూ సక్సెస్‌ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. శ్రీనివాస్‌ రెడ్డితో పాటు, షకలక శంకర్‌, సత్య ఈ సినిమాలో లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు.

 

దిల్‌ రాజు ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాకి కథ, మాటలు అందించిన పరమ్‌ సూర్యాన్షు ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు. అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా డిశంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి, ఈ సారి శ్రీనివాస్‌ రెడ్డి తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS