కృష్ణవంశీ రంగమార్తండ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా కమర్షియల్గా అటూ.. ఇటూ ఊగిసలాడుతున్నా.. ఓ మంచి సినిమా వచ్చిందన్న పేరైతే తెచ్చుకొంది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన బ్రహ్మానందంకి చక్కటి గుర్తింపు దక్కుతోంది. ఇప్పటి వరకూ తెలుగు ప్రేక్షకులు చూసిన బ్రహ్మానందం వేరని, ఈ బ్రహ్మానందం వేరని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సీరియస్ పాత్రలో బ్రహ్మానందంని ఎలా ఊహించారంటూ.. కృష్ణవంశీకి కితాబులు అందిస్తున్నారు. ఈ సినిమా వల్ల ఎక్కువ లాభపడింది బ్రహ్మీనే.
అయితే... రంగమార్తండలోని చక్రి పాత్రకి మొదటి ఛాయిస్ బ్రహ్మానందం కాదు. ప్రకాష్ రాజ్ ఈ పాత్రని మోహన్ బాబుతో చేయిద్దామనుకొన్నారు. ఆ తరవాత నాజర్, నరేష్, రాజేంద్ర ప్రసాద్ లాంటి పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి. ప్రకాష్రాజ్ మైండ్ లో మాత్రం ఈ పాత్రకి మోహన్ బాబు అయితే కరెక్ట్ అనిపించిందట. అంతే కాదు,.. కృష్ణవంశీ కూడా మోహన్ బాబుని అడిగేద్దామని డిసైడ్ అయ్యాడట. అయితే అనూహ్యంగా కృష్ణవంశీ మనసు బ్రహ్మానందం వైపు లాగింది. దాని వల్ల సినిమాకి మంచే జరిగింది. మోహన్ బాబు చేసి ఉంటే ఎలా ఉండేదో తెలీదు కానీ, బ్రహ్మానందం మాత్రం చక్రి పాత్రకు నూటికి నూరుపాళ్లూ న్యాయం చేసి, కృష్ణవంశీ ఆలోచనే కరెక్ట్ అని నిరూపించాడు.