సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకి సంబంధించిన రగడ ఇంకా జరుగుతూనే ఉంది. ఈ సినిమాని తెలంగాణాలో విడుదల చేశారు. కానీ ఆంధ్రాలో విడుదల కానివ్వలేదు. ఎలక్షన్స్ ముగిశాయి కాబట్టి మే 1న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఆంధ్రాలో విడుదల చేస్తానని వర్మ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో సినిమా విడుదలకు సంబంధించి విజయవాడలో ప్రెస్ మీట్ ప్లాన్ చేశారు రామ్గోపాల్ వర్మ. ఓ హోటల్లో ఈ ప్రెస్ మీట్కి ఏర్పాట్లు చేశారు. కానీ ఆ హోటల్ యాజమాన్యం అనుమతి నిరాకరించడంతో రోడ్డుపై ప్రెస్ మీట్కి ప్లాన్ చేశారు. అయితే ఈ ప్రెస్ మీట్ని ఆంధ్ర పోలీసులు అడ్డుకున్నారు. ఈ చర్యను అందరూ ఖండిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వర్మ చేసిన తప్పేంటి.? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సినీ భావ ప్రకటనా స్వేఛ్చపై ఉక్కు పాదం మోపినట్లే అని ఈ చర్యను పలువురు ఖండిస్తున్నారు. ఇదిలా ఉంటే, వైఎస్సార్ సీపీ నేతలే ఈ సినిమాకి నిర్మాతలు అన్న సంగతి తెలిసిందే.
నిజానికి ఈ సినిమా తెలంగాణాలో విడుదలైంది. ఆంధ్ర నుండి చాలా మంది అభిమానులు తెలంగాణాకొచ్చి మరీ ఈ సినిమాని చూశారు. ఇంత జరిగినాక ఇక ఇప్పుడు సినిమా విడుదలపై అసలింతగా అభ్యంతరాలెందుకు వ్యక్తమవుతున్నాయో అర్ధం కావడం లేదు.