అంబికా కృష్ణ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. భతవంతుడికీ భక్తుడికీ అనుసంధామైన అంబికా దర్బార్ బత్తిలా ప్రతీ హీరోకీ, ప్రతీ దర్శకుడికీ ఈయన ఎప్పుడూ టచ్లో ఉంటారు. వివాదాలకు దూరం. అలాంటి అంబికాకృష్ణ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న హీరోలు, దర్శకుల వల్ల పరిశ్రమ నాశనం అవుతుందని షాకింగ్ కామెంట్లు ఇచ్చారు.
దాసరి మెమోరియల్ అవార్డు ఫంక్షన్ బుధవారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో అంబికా కృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగులో దాదాపు 14 మంది అగ్ర కథానాయకులున్నారని, వాళ్లంతా యేడాదికి రెండు సినిమాలు చేసినా.. నెలకు రెండు పెద్ద సినిమాలు విడుదల అవుతాయని, కానీ హీరోలంతా యేడాదికి ఒక సినిమా, రెండేళ్లకు ఒక సినిమా చేస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. చిన్న సినిమాలు బాక్సాఫీసు దగ్గర నిలబడలేకపోతున్నాయని, పెద్ద సినిమాలు తగ్గిపోతున్నాయని, దాంతో పరిశ్రమ సంక్షోభంలో పడుతోందని, ఈ పద్ధతి మారాలని పిలుపునిచ్చారు.
దాసరి, కృష్ణ లాంటి వాళ్లు వీలైనన్ని ఎక్కువ సినిమాలు తీయడానికి ప్రయత్నించేవారని, అందుకే అప్పట్లో పరిశ్రమ కొత్త కొత్త సినిమాలతో కళకళలాడేదని గుర్తు చేశారు. ఇదే వేదికపై ఉన్న రాజశేఖర్ అంబికా కృష్ణ వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. మంచి కథలు లేకపోవడం వల్లే వేగం తగ్గిందని, తీసిన ఒక్క సినిమా అయినా డబ్బులు వచ్చేదై ఉండాలన్నది దర్శకుల ప్రయత్నమని అన్నారు. ఏదేమైనా అంబికా వ్యాఖ్యలు హీరోలకు సూటిగా తాకేవే.