యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు అస్థవ్యస్థమైపోతున్నాయి. ప్రభుత్వాలు ఘోరమైన ఆర్ధిక నష్టాన్ని భరిస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల క్షేమాన్ని కాంక్షించిన ప్రభుత్వం లాక్డౌన్కి ఆదేశమిచ్చింది. అయితే, కొన్ని వెసులుబాట్లు కల్పించిందనుకోండి. ఈ క్రమంలో లాక్డౌన్ కారణంగా ప్రజల్ని పనులు మానేసి ఇళ్లకే పరిమితమవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసరం అయితే, తప్ప ఇళ్లలోంచి బయటికి రావద్దని సూచించింది. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ, సోమవారం నుండి జనం రోడ్లపై గుమిగూడడం మొదలెట్టేశారు. దాంతో ప్రభుత్వం మళ్లీ ఆందోళనలో పడింది.
ఈ సందర్భంలో అనసూయ సోషల్ మీడియాలో ఓ స్టిన్నింగ్ పోస్ట్ పెట్టింది. ‘డైలీ పనులు చేసుకునేవాళ్లం, ఇళ్లకే పరిమితమైతే ఏంటీ మా పరిస్థితి.? రెంట్లు కట్టుకోవాలి. ఈఎమ్ఐలు కట్టుకోవాలి.. లాక్డౌన్ విషయంలో తెలంగాణా ప్రభుత్వం పునరాలోచన చేయాలి..’ అనేలా అనసూయ పెట్టిన పోస్ట్కి బాధ్యత గల నెటిజన్లు విస్తుపోతున్నారు. ఓ పక్క కరోనా కారణంగా జనాల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతుంటే, రెంట్లు, ఈఎమ్ఐలూ.. అంటావా.? కనీసపాటి రెస్పాన్సిబులిటీ లేకపోతే ఎలా.? అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదిలా ఉంటే, తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్లకు ప్రభుత్వం ఇప్పటికే ఫ్రీ రేషన్తో పాటు, 1500 రూపాయలు వేతనం ఇస్తామని ప్రకటించింది.
ప్రభుత్వాలు ఇంత బాధ్యతగా వ్యవహరిస్తుంటే, ఓ సెలబ్రిటీగా తన వంతు బాధ్యత తాను నిర్వర్తించలేకపోతోందని అనసూయ అని విమర్శిస్తున్నారు. కొందరైతే అక్కడితో ఆగడం లేదు. నువ్వు కూడా తెల్ల రేషన్ కార్డ్ అప్లై చేసుకో, నీకూ మా కేసీఆర్ సారు ఫ్రీ రేషన్ పంపిస్తారు. ఈఎమ్ఐ కోసం 1500 రూపాయల వేతనం కూడా ఇస్తారు.. అని సోషల్ మీడియా వేదికగా అనసూయకి పులుసు పిండి తలంటు పోస్తున్నారు.