ఏపీ, తెలంగాణ... ఈ రెండు రాష్ట్రాలూ.. తెలుగు సినిమాకి రెండు కళ్లు. తెలంగాణలో నైజాం, ఏపీలో ఆంధ్రా, సీడెడ్... సినీ మార్కెట్కు ప్రాణాలు. ఇవి మూడూ పచ్చగా ఉంటేనే చిత్రసీమ కళకళలాడుతుంది. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి కనిపించడం లేదు. కరోనా తరవాత కాస్త పుంజుకొన్నట్టు కనిపించిన టాలీవుడ్.. ఇప్పుడు మళ్లీ దిగాలు పడిపోయింది. నైజాంలో ఓకే.. అనిపిస్తున్న థియేటర్లు.. ఏపీలో మాత్రం బేల మొహం వేస్తున్నాయి. అక్కడ క్రమంగా ఒక్కో థియేటర్కీ తాళాలు పడుతున్నాయి. ఈమధ్య ఏపీలో దాదాపుగా 400 థియేటర్లని మూసివేసిన వైనం... టాలీవుడ్ కి షాక్ ఇస్తోంది.
ఏపీలో దాదాపుగా 1200 థియేటర్లు (స్క్రీన్లు) ఉన్నాయి. వాటిలో 400 మూసేశారంటే... పావు వంతు అన్నమాట. మిగిలిన థియేటర్ల పరిస్థితీ అంతంతమాత్రంగానే ఉంది. ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్ తరవాత సరైన హిట్టు టాలీవుడ్ లో పడలేదు. వచ్చిన ప్రతీ సినిమా బోల్తా కొడుతోంది. పైగా.. థియేటర్లకు వచ్చి సినిమాలు చూసేంత ఓపిక ఇప్పుడు సగటు ప్రేక్షకుడికి లేదు. ఓటీటీల వల్ల వినోదం ఇంటికే వచ్చేస్తోంది. ఎంత పెద్ద సినిమా అయినా సరే, మూడు వారాలు ఆగితే.. ఇంట్లోనే కుటుంబ సభ్యులతో సహా చూసేయొచ్చు. అలాంటప్పుడు జనాలు థియేటర్లకు ఎందుకొస్తారు? అందుకే చిత్రసీమ కష్టాల్లో పడింది. తొలి దెబ్బ థియేటర్లపై పడింది. పెద్ద సినిమా వస్తే తప్ప....ఆ 400 థియేటర్లు తెరచుకోవు. పెద్ద సినిమా వస్తే సరిపోదు. ఆడాలి. జనాలు థియేటర్లకు రావాలి.
మంచి సినిమా వేస్తే తప్పకుండా జనాలు థియేటర్ల ముందు క్యూ కడతారు. అలాంటి సత్తా ఉన్న సినిమా తీస్తే.. మళ్లీ థియేటర్ వ్యవస్థ పుంచుకుంటుంది. లేదంటే... మిగిలిన థియేటర్లకూ ఇలానే తాళాలు వేయాల్సివస్తుంది.