బండ్ల వెర్సస్‌ పీవీపీ: ఇంతకీ 'టెంపర్‌' ఎవరికి?

మరిన్ని వార్తలు

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. అరె.. ఈ మధ్య సినిమాలకు దూరమై, రాజకీయాలంటూ తిరిగి ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ చూపించి భంగపడి, తిరిగి సినిమాల్లో అడుగుపెట్టిన బండ్ల గణేష్‌ కేసుల్లో ఇరుక్కోవడమేంటీ.? అనుకుంటున్నారా? ఈ కేసు కూడా సినిమా కేసే. అయితే ఇప్పటిది కాదు.

 

అసలు వివరాల్లోకి వెళితే, 'టెంపర్‌' సినిమా టైంలో సినీ ఫైనాన్షియర్‌, సహ నిర్మాత అయిన పొట్లూరి వరప్రసాద్‌ వద్ద బండ్ల గణేష్‌ కొంత మొత్తం అప్పు తీసుకున్నారు. సినిమా విడుదల సమయంలో అందులోని కొంత మొత్తాన్ని చెల్లించి, మిగిలిన మొత్తానికి చెక్కులు అందించారు బండ్ల గణేష్‌. ఆ చెక్కులకు సంబంధించి ఇంతవరకూ సమాధానం రాకపోవడంతో, డబ్బులు తిరిగిమ్మని పీవీపీ, బండ్ల గణేష్‌ని కోరగా, గణేష్‌ ఇంటి మీదకి మనుషుల్ని పంపి, తనని బెదిరించారంటూ పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు బండ్ల కోసం వెతుకుతున్నారనీ, ఆయన పరారీలో ఉన్నారంటూ వార్తలు ప్రచురితమవుతున్నాయి. అయితే, తాజాగా మీడియాతో ఫోన్‌లో మాట్లాడిన బండ్ల గణేష్‌ వెర్షన్‌ మరోలా ఉంది. డబ్బులివ్వకుంటే మర్డర్‌ చేస్తానంటూ, పీవీపీనే తనను బెదిరించాడంటూ బండ్ల గణేష్‌ కేసు పెట్టారు. అయితే, పూర్తి విభిన్నంగా ఉన్న ఈ రెండు కేసులకు సంబంధించి, నిజమేంటో పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బండ్ల గణేష్‌ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS