‘ఇప్పుడున్న పరిస్థితుల్లో జీరో రెమ్యునరేషన్కి సిద్ధమైతే మంచిది..’ అంటూ ‘వి’ సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరో నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. కానీ, అది సాధ్యమేనా.? ఛాన్సే లేదు. నాని మాత్రం అది తన వ్యక్తిగత అభిప్రాయమన్నాడు. మంచిదే.. ఆ దారిలోకి ఎవరైనా వెళితే. మరి, నాని అలా చేస్తాడో లేదో తెలియదు. కాగా, మెగాస్టార్ చిరంజీవి.. జీరో రెమ్యునరేషన్ దిశగా అడుగులేస్తున్నారట. అది ‘ఆచార్య’ సినిమాతోనే స్టార్ట్ చేస్తారని అంటున్నారు.
గతంలోనూ చిరంజీవి, రెమ్యునరేషన్ విషయంలో విప్లవాత్మక మార్పులు సినీ పరిశ్రమలోకి తీసుకొచ్చారు. రెమ్యునరేషన్ కోసం నిర్మాతలపై ఒత్తిడి తీసుకురాకుండా, సినిమా లాభాల్లో వాటాలు తీసుకునేవారట చిరంజీవి. చాలామంది నిర్మాతలు, రెమ్యునరేషన్ విషయంలో చిరంజీవి ధైర్యాన్ని, గొప్పతనాన్ని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ‘ఆచార్య’ సినిమాకీ, ఆ తర్వాతి సినిమాకి కూడా రెమ్యునరేషన్ గురించి చిరంజీవి ఆలోచించడంలేదంటూ టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజమే, కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. చాలామంది నటీనటులు, నిర్మాతల మేలు కోసం ఇంకాస్త గట్టిగానే ఆలోచించడం మొదలు పెట్టారు. నిర్మాత లేకపోతే సినిమానే లేదు. సినిమా హాళ్ళు తెరుచుకుని, సినిమాల ప్రదర్శన ఇదివరకటి స్థాయికి చేరుకునేదాకా సినిమా మనుగడ సాధించాలంటే, ఖచ్చితమైన నిర్ణయాలు ఇలాంటివి అవసరమే.