గత రెండు మూడు నెలలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టబడింది. అదే- టాప్ హీరోలంతా “తమ మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు” అని... “మేము మేము అంతా ఒకటే” అన్న భావనని తెలుగు సినిమా అభిమానులకి కలిగించే పనిలో నిమగ్నమయ్యారు.
అయితే “హీరోలంతా మంచిగానే ఉంటారు.. వారి అభిమానులు మాత్రం కొట్టుకుంట్టుంటారు” అన్న నానుడి ఎప్పటి నుండో ప్రచారంలో ఉన్నప్పటికి, ఇప్పుడు మాత్రం అది ప్రదర్శించడం మొదలైంది. ఇప్పటికే మహేష్ బాబు భరత్ అనే నేను ప్రీ-రిలీజ్ కి ఎన్టీఆర్ రావడం ఆ తరువాత ఈ ఇద్దరు కలిసి రామ్ చరణ్ ఇంటికి వెళ్ళి రంగస్థలం సక్సెస్ ని సెలబ్రేట్ చేయడం. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ ఒకేరోజు రెండు సినిమా ఈవెంట్స్ లో ముఖ్య అతిధిగా వెళ్ళడం..
ఇక మొన్నటికి మొన్న ఎన్టీఆర్-ప్రణతిల వివాహ వార్షికోత్సవాన్ని రామ్ చరణ్ తన ఇంటిలో చేయడం వంటి వాటితో సగటు సినీ అభిమాని ఒక్కసారిగా ఇదేంటబ్బా ఇంతలా ప్రేమని ఒకరిపై మరొకరు కురిపించేసుకుంటున్నారు అన్న అనుమానం మొదలవుతున్నాయి.
ఇవ్వన్ని కాదు.. నిన్న తారక్ పుట్టినరోజు సందర్భంగా చరణ్-ఎన్టీఆర్ ప్రాణ స్నేహితుల్లా కలిసి దిగిన ఫోటోని రామ్ చరణ్ పోస్ట్ చేయడంతో వీరిరువురు ప్రస్తుతం ఎంత స్నేహంగా ఉంటున్నారు అన్నది స్పష్టమవుతుంది.
ఇవన్ని పక్కన పెడితే, స్టార్ హీరోలు ఉన్నట్టుండి ఇలా “ స్నేహ ప్రదర్శనలు” ఎందుకు చేస్తున్నారు? దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? లేక ఈ మధ్య టాలీవుడ్ కి కొన్ని మీడియా సంస్థలకి మధ్య ఏర్పడిన వివాదమా? చరణ్-తారక్ ల స్నేహానికి కారణం రాజమౌళి #RRR సినిమానా? అనే ప్రశ్నలు సమాధానం కోసం చూస్తున్నాయి.
ఇక ఆ వివాదం సమయంలో హీరోలందరూ ఒకే తాటి పైకి రావడం దానికి మెగాస్టార్ చిరంజీవి నేతృత్వం వహించడం వంటి పరిణామాలు చూస్తే.. తామంతా ఐకమత్య రాగం వినిపించడం వల్ల భవిష్యత్తులో తమని ఎవరు చులకన చేయరు అన్న అభిప్రాయం వారిలో ఏర్పడి ఉండవచ్చు అని అనుకోవచ్చు.
అయితే వారి ఈ అకస్మాత్తుగా చేస్తున్న “స్నేహ ప్రదర్శనలు” తెలుగు పరిశ్రమకి మంచిని చేకూరుస్తుంది అన్న ఆశాభావం కూడా వ్యక్తమవుతున్నది.
ఏదేమైనా.. ప్రదర్శనల మాట ఎలా ఉన్నా.. హీరోల మధ్య బంధం మాత్రం తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఉండాలని కోరుకుందాం...