చాక్లెట్ బోయ్లా కనిపిస్తూ, క్రమ క్రమంగా విలక్షణ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా మారాడు యంగ్ హీరో అడవి శేష్. అడవి శేష్ నుండి సినిమా వస్తుందంటే, ఖచ్చితంగా సమ్థింగ్ డిఫరెంట్ మూవీ అనేలా ప్రింట్ వేయించుకున్నాడు. 'క్షణం', 'అమీ తుమీ', 'గూఢచారి' చిత్రాలతో ఆల్రెడీ హిట్స్ సొంతం చేసుకున్నాడీ యంగ్ హీరో. తాజాగా 'ఎవరు' అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో వస్తున్నాడు. వెంకట్ రాంజీని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు అడవి శేష్ ఈ సినిమాతో.
పీవీపీ బ్యానర్లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది. రెజీనా, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నాడు. కాగా, లేటెస్ట్గా విడుదలైన ట్రైలర్కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. నాని చేతుల మీదుగా ఈ ట్రైలర్ని విడుదల చేశారు. ట్రైలర్లో థ్రిల్లింగ్ అంశాల్ని ఆకట్టుకునేలా చూపించారు. విజువలైజేషన్ చాలా రిచ్గా కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఇది తెలుగు సినిమానా.? లేక ఇంగ్లీష్ సినిమానా.? అనే అనుమానం కలిగిందంటూ నాని సినిమాపై ప్రశంసలు గుప్పిస్తున్నాడు. ఇంతకీ 'ఎవరు' కథేంటంటే, ఈ సినిమాలో స్క్రీన్ప్లే ప్రేక్షకుడ్ని కట్టిపడేసేలా ఉంటుందట.
ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంటుందట. నెక్స్ట్ ఏంటీ? అనేది అసలు ఊహించడానికే కష్టమనీ, ఒకవేళ ఊహించినా, మీ ఊహకు వ్యతిరేకంగా కథలో మలుపులుంటాయనీ అంటున్నాడు అడవి శేష్. కథలో మూవ్ అవుతున్న ప్రతీ క్యారెక్టర్ గురించి మీరు ఓ అభిప్రాయానికి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ తీరు తెన్నులు ఊహించని విధంగా మారిపోతాయట. మొత్తానికి అడవి శేష్ 'ఎవరు'తో 100 పర్సెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కిక్ ఇవ్వనున్నాడని అయితే అర్ధమైపోతోంది. ఆ కిక్ని ఆడియన్స్ ఎలా ఫీలయ్యారో తెలియాలంటే, ఆగస్ట్ 15 వరకూ ఆగాల్సిందే.