రేపు అనగా జనవరి 11న గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానున్న 'సరిలేరు నీకెవ్వరూ..' సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా విడుదల కాబోయే ధియేటర్స్ వద్ద ఫ్యాన్స్ కోలాహలం మామూలుగా లేదు. భారీ కటౌట్లు, పూల దండలతో ధియేటర్స్ని ముస్తాబు చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ధియేటర్లలో పండగ వాతావరణం కనిపిస్తోంది. పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేసి, భారీ ఎత్తున పూల దండలతో ఆలంకరించి రికార్డు సృష్టిస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. అలాగే ఓవర్సీస్లో మహేష్ మార్కెట్ సంగతి తెలిసిందే. ఓవర్సీస్లో ప్రీమియర్స్ నిమిత్తం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ రాత్రి నుండే ప్రీమియర్స్ హవా కొనసాగనుంది.
ఇదిలా ఉంటే, 'సరిలేరు..' అదనపు షోలకు అనుమతి కావాలంటూ చిత్ర నిర్మాత అనిల్ సుంకర ఆంధ్రపదేశ్ ప్రభుత్వానికి లేఖ రాయగా, ఆ లేఖను పరిశీలించి సానుకూలంగా స్పందించిన జగన్ ప్రభుత్వం రెండు అదనపు షోలకు అనుమతినిచ్చింది. వారం రోజుల పాటు ఈ అదనపు షోలు కొనసాగనున్నాయి. జనవరి 11 నుండి, 17వ తేదీ వరకూ ఈ అదనపు షోలు అందుబాటులో ఉండనున్నాయి. అయితే, తెలంగాణాలో అదనపు షోలకు అనుమతి లభించలేదు. గత కొంత కాలంగా తెలంగాణా ప్రభుత్వం అదనపు షోల అనుమతిని నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే.