28 ఏళ్ళ క్రితం వచ్చిన ఓ తెలుగు సినిమా.. తెలుగునాట సరికొత్త రికార్డుల్ని సృష్టించింది. తెలుగు సినిమా స్టామినాని పెంచింది. ఆ సినిమానే ‘ఘరానామొగుడు’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నగ్మా, వాణి విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించారు. దేవి ఫిలింస్ పతాకంపై నిర్మాత దేవీ వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమా ‘ఘరానామొగుడు’. ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ ట్రెండీగా అనిపిస్తాయి. ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డాన్సులు.. ఇప్పటికీ వెరీ వెరీ స్పెషల్. నగ్మా, వాణి విశ్వనాథ్.. ఈ ఇద్దరి అందాల ఆరబోత, అంతకు మించి మెగాస్టార్ చిరంజీవితో కెమిస్ట్రీ.. ఇవన్నీ ‘ఘరానామొగుడు’ ప్రత్యేకతలు.
ఫుల్ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘ఘరానామొగుడు’. ఈ ట్రెండ్కి తగ్గట్టుగా రీమేక్ చేయగలిగితే.. మరోసారి ‘ఘరానామొగుడు’ మ్యాజిక్ రిపీట్ అవుతుంది. కానీ, ఆ సాహసం చేసేవారెవరు.? ఆ సంగతి పక్కన పెడితే, 28 ఏళ్ళ క్రితం ‘ఘరానామొగుడు’ సంచలన విజయాన్ని అందుకున్న దరిమిలా, ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ, మెగాస్టార్ చిరంజీవిని ప్రశంసల్లో ముంచెత్తేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సోషల్ మీడియా వేదికగా. అయితే, ఆ ‘మెగా’ క్రెడిట్ అంతా దర్శకుడిదేనని చిరంజీవి చెప్పడం గమనార్హం. కీరవాణి మ్యూజిక్, దేవివరప్రసాద్ నిర్మాణపు విలువలు.. ఇవన్నీ ఆ సినిమాని ఉన్నత స్థానంలో నిలబెట్టాయన్నారు చిరంజీవి. ‘మమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు.. పళ్ళల్లో పెట్టి కూడా చేసుకున్నారు..’ అంటూ చిరంజీవి తనదైన స్టయిల్లో ఛమక్కులు విసిరారు రాఘవేంద్రరావు మీద.