ఏ హీరో అయినా, తానేంటో నిరూపించుకోవాలంటే సక్సెస్, ఫెయిల్యూర్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూనే ఉండాలి. ఆదే మన హీరో కార్తికేయ చేస్తున్నాడు. తొలి సినిమాకే సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్తో మనోడికి వరుస ఆఫర్లు దక్కాయి. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని వీలైనంత ఎర్లీగా సినిమాలు కంప్లీట్ చేసేశాడు. ఆ వరుసలో కార్తికేయ నుండి రెండో సినిమాగా మొన్న 'హిప్పీ' విడుదలైంది. ఈ సినిమా రిజల్ట్ ఏంటీ.? అనే సంగతి పక్కన పెడితే, రిజల్ట్తో సంబంధం లేకుండా త్వరలోనే మూడో సినిమాని విడుదల చేసే సాహసం చేస్తున్నాడు కార్తికేయ.
అదే 'గుణ 369'. మాస్ మసాలా యాక్షన్ డైరెక్టర్ అయిన బోయపాటి వద్ద శిష్యరికం చేసిన అర్జున్ జంధ్యాల ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయమవుతున్నాడు. కొత్తమ్మాయి అనఘా హీరోయిన్గా తెరంగేట్రం చేస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ని వదిలింది చిత్రయూనిట్. టీజర్ చూస్తుంటే, గురువుగారు బోయపాటి శీను మేకింగ్ స్టిల్స్ మక్కీకి మక్కీ దించేసినట్లుంది. టీజర్లో రివీల్ చేయలేదు కానీ, ఇంటర్నల్గా ఇదో ఫ్యాక్షన్ లవ్స్టోరీ అని అర్ధమవుతోంది. ఫ్యాక్షన్ అండ్ యాక్షన్కి పెట్టింది పేరు బోయపాటి శీను. అదే స్క్రిప్టును కొంచెం కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు ఈ కొత్త డైరెక్టర్. కానీ, ఫ్లేవర్ అక్కడికే వెళుతోంది. టీజర్లో ఆ ఫ్లేవర్ పూర్తిగా రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ, డైలాగ్స్ని బట్టి, పైకి సాఫ్ట్గా కనిపిస్తున్న హీరోకి వెనక ఏదో పవర్ఫుల్ ఫ్లాష్బ్యాక్ ఉన్నట్లే ఉంది. అయితే దాన్ని ప్రస్తుతానికి దాచి పెట్టారు. చూడాలి మరి, కార్తికేయ ముచ్చటగా ఈ మూడో సినిమాతో తొలి సినిమా సంచలనాన్ని రిపీట్ చేస్తాడేమో. వచ్చే నెలలో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.