బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్తో పెట్టుకుంటే అంతే సంగతి. అందుకే ఎందుకొచ్చిన గొడవలే అని స్టార్ హీరోలు సైతం ఆమె విషయంలో మిన్నకుండిపోతారు. ఇక తాజాగా మీడియా ఆమెతో పెట్టుకుందనాలో.. లేక మీడియాని కంగనానే కెలికిందనాలో.. తెలీదు కానీ, మొత్తానికి కంగనా వెర్సస్ మీడియా వ్యవహారమైతే రచ్చకెక్కింది. కంగనా వెర్షన్ తీసుకుంటే, మీడియాలో కొందరు మంచి మిత్రులున్నారనీ, తన విజయంలో వారి ప్రోత్సాహం ఎంతో ఉందనీ, వారికి తానెప్పుడూ రుణపడి ఉంటాననీ కంగనా చెప్పుకొచ్చింది.
కానీ, ఇంకొందరు జర్నలిస్టులు కనీసం టెన్త్ కూడా పాసవకుండా వారు జర్నలిస్టుగా మారి, దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారనీ, అలాంటి వారిపైనే తన కోపమనీ చెప్పింది. అసలు సంగతేంటంటే, ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్లో కంగనా తీరు మీడియాకి నచ్చలేదు. దాంతో ఆమెపై విరుచుకుపడ్డారు. ఓ జర్నలిస్టుపై కంగనా అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారనీ, ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన సదరు విలేఖరికి కంగనా సహకరించలేదు సరికదా.. నోటికొచ్చినట్లు దుర్భాషలు ఆడిందనీ ఆరోపిస్తూ, ఈ విషయమై కంగనా తమకు క్షమాపణలు చెప్పాలనీ, లేకుంటే, ఆమెపై బ్యాన్ విధిస్తామంటూ హెచ్చరించారు.
ఇదీ అసలు వివాదం. అయితే, అక్కడుంది కంగనా కదా.. ఆ సంగతి మర్చిపోతే ఎలా.? అందుకు కంగనా క్షమాపణలు చెప్పలేదు సరికదా.. ఘాటుగా రిప్లై ఇచ్చింది. నన్ను బ్యాన్ చేస్తారా..? అయితే సరే, 'ప్లీజ్ నన్ను బ్యాన్ చేసేయండి..' అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ స్టేట్మెంట్తో సదరు జర్నలిస్టులే కాదు, నెటిజన్లు, అభిమానులు కూడా షాక్లో మునిగిపోయారు. అందుకే చెప్పేది.. ఎవరితోనైనా పెట్టుకునే ముందు.. ముఖ్యంగా కంగనాతో పెట్టుకోవాలంటే ముందూ వెనకా ఖచ్చితంగా ఓ ఆలోచన చేయాలి సుమీ.