చిత్రసీమ ఇప్పుడు సంక్షోభంలో ఉంది. నిర్మాతలు ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్నారు. సినిమాలు తీయాలన్నా, ప్రదర్శించాలన్నా కరోనా భయం. పెట్టుబడి తిరిగి వస్తుందో, రాదో అన్న గ్యారెంటీ లేదు. ఖర్చు అదుపులో పెట్టుకోవడం ఒక్కటే వాళ్ల ముందున్న ప్రధానమైన మార్గం. అలా చేయాలంటే.. తారలు పారితోషికాలు తగ్గించుకోవాల్సిందే. స్టార్ హీరోలు ఈ విషయంలో ఏం చేస్తున్నారో తెలీదు గానీ, హీరోయిన్లు మాత్రం కాస్త పెద్ద మనసుతో వ్యవహరిస్తున్నారు. పారితోషికాలు తగ్గించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వాళ్లలో మహానటి కీర్తి సురేష్ కూడా ఉంది.
కీర్తి పారితోషికం కోటికిపైమాటే. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అంటే ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే.. ఇప్పుడు కీర్తి పారతోషికం తనకు తానై తగ్గించుకుంటోంది. తన పారితోషికంలో 20 నుంచి 30 శాతం రిబేట్ ఇస్తున్నా అంటూ ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, నిర్మాతల శ్రేయస్సుని, సినిమా పరిశ్రమ మనుగడని దృష్టిలో ఉంచుకుని, తారలు పారితోషికం తగ్గించుకోవాలని, అందులో భాగంగా తాను కూడా పారితోషికం తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. కథ నచ్చితే, పారితోషికం గురించి ఆలోచించనని, డబ్బు సంపాదన కంటే మంచి పాత్రలు చేయడంలో గొప్ప సంతృప్తి దొరుకుతుందని, మంచి పాత్రలు చేసుకుంటూ వెళ్తే, డబ్బులు వాటంతట అవే వస్తాయని చెప్పుకొచ్చింది కీర్తి. ఈ బాటలోనే మిగిలిన హీరోయిన్లంతా నడిస్తే - నిర్మాతలకు ఉపశమనం దొరికినట్టే.