తెలుగులో 'భరత్ అనే నేను' సినిమాతో పాపులర్ అయిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ, ఆ తర్వాత బాలీవుడ్లో 'కబీర్ సింగ్'తో సెన్సేషనల్ హిట్ కొట్టి, క్రేజీ స్టార్ అయిపోయింది. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్కి కియారాని బాలీవుడ్ జనం ఆమెని వదలడం లేదు. వరుస ఆఫర్లు ఇచ్చి అక్కడే తిష్ట వేసేలా చేశారు. ప్రస్తుతం కియారా చేతిలో అరడజనుకు పైగానే ప్రాజెక్టులున్నాయి. అన్నీ బిగ్ ప్రాజెక్టులే కావడంతో, మరే ఇతర ప్రాజెక్టుల్నీ ఒప్పుకునేందుకు కుదరడం లేదు కియారా అద్వానీకి.
తనకు స్టార్డమ్ దక్కడానికి కారణమైన సౌత్ ఇండస్ట్రీని మర్చిపోననీ, ఎప్పటికీ వదులుకోననీ చెబుతున్నా.. బాలీవుడ్ని వదిలి రావడం కియారాకి అసాధ్యమే అనిపిస్తోంది ప్రస్తుత తరుణంలో. అక్కడ ఒక సినిమాలో నటిస్తేనే, మిగిలిన ప్రాజెక్టులు క్లిష్ట పరిస్థితిలో పడతాయి. అలాంటిది అంత బిజీగా ఉన్న కియారా ఇప్పుడప్పుడే సౌత్పై దృష్టి పెట్టే అవకాశాలే లేవు. ఈ మధ్య విజయ్ తాజా చిత్రంలో కియారాకి అవకాశం వచ్చింది. కానీ, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ ఛాన్స్ మిస్ చేసుకోవాల్సి వచ్చింది.
ఇక తెలుగు సంగతి చెప్పనే అక్కర్లేదు. అల్లు అర్జున్తో కియరా ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ, అది ఇప్పట్లో కుదిరేలా కనిపించడం లేదు. సో సౌత్ ప్రేక్షకులు కియారాని మర్చిపోవడమే మంచిది అనే అభిప్రాయంలో ఆమె ఫ్యాన్స్ ఉన్నారట. అంతే మరి, నార్త్లో ఒక్కసారి క్లిక్ అయితే చాలు.. అలాగే ఉంటుంది. ఎంతైనా ఆ రేంజే వేరు.