'జెంటిల్మెన్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది మలయాళ బ్యూటీ నివేదా థామస్. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. 'నిన్ను కోరి'తో మంచి యాక్టింగ్ టాలెంట్ ప్రదర్శించి, మరో హిట్ సొంతం చేసుకుంది. 'జై లవకుశ'లో ఎన్టీఆర్తో ఆడి పాడి స్టార్ హీరోయిన్ దిశగా పరుగులు మొదలెట్టింది. ఆ తర్వాత నివేదా జోరు తగ్గింది. అందుకు కారణం అవకాశాలు రాక కాదు, స్టడీస్ పరంగా కొంచెం గ్యాప్ తీసుకున్నానని తర్వాత ఈ బ్యూటీనే చెప్పుకొచ్చింది.
లేటెస్టుగా నందమూరి హీరో కళ్యాణ్రామ్తో ఓ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలున్నారు. నివేదాతో పాటు, 'అర్జున్రెడ్డి' ఫేం షాలినీ పాండే కూడా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో నివేదా థామస్ది అత్యంత కీలకమైన పాత్రట. ఇదో థ్రిల్లర్ మూవీ. గుహన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హారర్ అంశాలు ఈ సినిమాలో సరికొత్తగా చూపించనున్నారట.
తొలిసారిగా నివేదా ఈ జోనర్ మూవీలో నటిస్తోంది. యాక్టింగ్లో ఆల్రెడీ తానేంటో ప్రూవ్ చేసుకున్న నివేదా థామస్కి ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా బాగా నచ్చేసిందట. అందుకే కొత్త డైరెక్టర్ అయిన గుహన్ కథ చెప్పగానే వెంటనే ఓకే చేసిందట. అయితే నివేదా ఈ సినిమాలో భయపడుతుందా? లేక ఆడియన్స్ని భయపెట్టే పాత్రలో కనిపిస్తుందా? అనేది సస్పెన్స్. తాజాగా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.