మహేష్ బాబు - త్రివిక్రమ్ల చిత్రానికి ఎలాంటి టైటిల్ పెడతారా? అంటూ.. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. చాలా పేర్లు చక్కర్లు కొట్టాయి. చివరికి `అమరావతికి అటూ.. ఇటూ` అనే టైటిల్ ఫిక్స్ చేశారని వార్తలొచ్చాయి. ఈ శ్రీరామనవమికి ఇదే టైటిల్ ని ప్రకటిస్తారని కూడా అనుకొంటున్నారు. టైటిల్ బాగుంది. క్లాస్ గా ఫ్యామిలీ టచ్తో సాగుతోంది. పైగా త్రివిక్రమ్ `అ` సెంటిమెంట్ ఇక్కడా వర్కవుట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ, ఇలాంటి టైటిల్ వల్ల పొలిటికల్ టచ్ ఇచ్చినట్టు అవుతుందేమో అనుకొంటున్నాడు మహేష్.
ఏపీలో రాజధానుల గొడవ సాగుతోంది. అమరావతినే రాజధానిగా చేయమని ఓ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఓ ముక్కలో చెప్పాలంటే అమరావతి చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇలాంటప్పుడు టైటిల్ లో అమరావతి ఉండడం వల్ల.. వద్దన్నా.. పొలిటికల్ టచ్ పడిపోతుంది. సినిమాకీ, కథకీ, రాజకీయాలతో సంబంధం లేకపోయినా.. ఆ యాంగిల్ లో మాట్లాడుకోవడం మొదలవుతుంది. ఇలాంటి సందర్భంలో.. ఇలాంటి రాజకీయాలు అవసరమా? అనేది మహేష్ ఆలోచన. మహేష్కి లేనిపోని వివాదాల్లో తలదూర్చడం ఇష్టం ఉండదు. అందుకే మరో ఆప్షన్ చూడమని.. త్రివిక్రమ్ ని కోరాడని టాక్. అందుకే టైటిల్ విషయంలో తర్జనభర్జనలు కొనసాగుతున్నాయని టాక్. అయోధ్యలో అర్జునుడు అనే మరో టైటిల్ ఈ సినిమా కోసం పరిశీనలలో ఉంది. అమరావతి కాకపోతే.. అయోధ్యకే మార్కులు పడే ఛాన్సుంది.