ఈమధ్య చిరంజీవి కుటుంబం మొత్తాన్ని వెనకేసుకుని మాట్లాడడానికి నాగబాబు బాగా ఉత్సాహం చూపిస్తున్నాడు. తన కుటుంబంపై ఈగ కూడా వాలనివ్వడం లేదు. ఎలాంటి ఇష్యూ వచ్చినా వెంటనే స్పందిస్తున్నాడు. దాంతో కొంత కాంట్రవర్సీ కూడా మొదలైపోతోంది. `చిరంజీవి డబ్బులు ఖర్చు పెట్టడు.. పిసినారి` అని ఆయనంటే గిట్టనివాళ్లు చెబుతుంటారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో సవివరంగా సమాధానం చెప్పాడు నాగబాబు.
''అన్నయ్య చాలాసార్లు జేబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టాడు. దివిసీమ ఉప్పెన సమయంలోనూ భారీగా విరాళాలు ఇచ్చాడు. వజ్రోత్సవాల సమయంలో ఎక్కువ మొత్తం డొనేషన్ ఇచ్చింది అన్నయ్యే. కానీ బయట చెప్పుకోడు. అదే తన తప్పు. ఏం చేసినా ప్రజల కోసం. మీడియా కోసం కాదు కదా..'' అంటూ క్లారిటీ ఇచ్చాడు. కరోనా సమయంలో పవన్ కూడా బయట కనిపించలేదు. దీనిపై కూడా నాగబాబు వివరణ ఇచ్చాడు. ''కరోనా సమయంలో అంతా ఇంటి పట్టున ఉండాలి. తను జనం మధ్యన వస్తే మాస్ గేదరింగ్ ఎక్కువ అయిపోతుంది. పరోక్షంగా కరోనా ప్రబలడానికి కారణం అవుతాడు. అందుకే తాను కనిపించలేదు. అయితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్ల కొద్దీ విరాళాలు ఇచ్చాడు. అది మర్చిపోకూడదు'' అని గుర్తు చేశాడు నాగబాబు. చిరు, పవన్ల గురించి ఇలా మాట్లాడే స్పీకర్ ఒక్కరున్నా చాలు అన్నది మెగా అభిమానుల మాట. ఆ బాధ్యతని నాగబాబు ఇప్పుడు గుర్తించినట్టుంది.