నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్గా కొన్ని సినిమాల్లో ట్రై చేసినా అవన్నీ ఫెయిల్యూర్స్ కావడంతో, ఇప్పుడు స్పెషల్ రోల్స్కి పరిమితమవుతున్నట్లే కన్పిస్తోంది. ఈ మధ్యనే ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఓ స్పెషల్ రోల్లో మెరిసిన నిహారిక మరోసారి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కన్పించబోతోందట. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘ఆచార్య’ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న విషయం విదితమే. ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర కోసం నిహారిక పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని ఓ స్టూడెంట్ పాత్ర కోసం నిహారికని ఎంపిక చేయడం దాదాపు ఖాయమైపోయిందని అంటున్నారు. అయితే, ఇప్పటిదాకా ఈ విషయమై ఎలాంటి ప్రకటనా ‘ఆచార్య’ టీం నుంచి బయటకు రాలేదు.
మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్తో కలిసి మెగా పవర్ స్టార్ రావ్ుచరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై ఈ ‘ఆచార్య’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. ఈ సినిమా కోసం తొలుత త్రిషని హీరోయిన్గా అనుకున్నా, ఇప్పుడు ఆమె ప్లేస్లోకి కాజల్ హీరోయిన్గా వచ్చింది. కాగా, సినిమా షూటింగ్ కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో, కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా.. పెద్ద బ్రేక్ పడింది. ‘ఆచార్య’ షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందన్నదానిపై మెగాస్టార్ చిరంజీవి స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. లాక్ డౌన్ ఎత్తివేస్తే తప్ప ‘ఆచార్య’ విషయంలోనే కాదు, తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఏ సినిమా మీదా స్పష్టత వచ్చే అవకాశం లేదు.