లేట్ చేస్తే చేశాడు కానీ, మన నైజాం బుల్లోడు నితిన్ వరుసగా మూడు సినిమాలు అనౌన్స్ చేసి ఫ్యాన్స్ని ఫుల్ ఖుషీ చేశాడు. మొన్న 'భీష్మ' చిత్రాన్ని లాంఛనంగా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకుడు. రష్మికా మండన్నా హీరోయిన్గా నటిస్తోంది. నిన్న చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో సినిమాని పట్టాలెక్కించాడు. రకుల్ ప్రీత్సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో నితిన్కి జోడీగా నటిస్తున్నారు. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అని ప్రస్తుతానికి సమాచారమ్.
ఇదిలా ఉంటే, ఈ రోజు కూడా నితిన్ ఖాళీగా లేడండోయ్. ముచ్చటగా మూడో సినిమానీ పట్టాలెక్కించేశాడు. కొద్ది రోజుల గ్యాప్లో మూడు సినిమాల్ని స్టార్ట్ చేసి భళా అనిపించాడు నితిన్. 'అ..ఆ' తర్వాత నితిన్ వరుసగా మూడు ఫెయిల్యూర్స్ చవి చూశాడు. ఆ మూడింటినీ ఈ మూడు సినిమాలతోనూ కవర్ చేసేయబోతున్నాడు కాబోలు. ఫుల్ జోష్తో మూడింటినీ స్టార్ట్ చేసేశాడు. ఇంతకీ నితిన్ మూడో సినిమా దర్శకుడెవరంటే, వెంకీ అట్లూరి.
'తొలిప్రేమ' సినిమాతో మనోడు సూపర్ హిట్ కొట్టాడు. తర్వాత అఖిల్తో 'మిస్టర్ మజ్ను' నిరాశపరిచాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాని నితిన్తో తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ రోజు అనగా సోమవారం లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకి 'రంగ్ దే' అను మంచి ఊపున్న టైటిల్ని ఫిక్స్ చేశారు.