'జాతి రత్నాలు' ఎఫెక్ట్ తెలుగు చిత్రసీమపై బాగా పడింది. ముగ్గురు స్నేహితులు, వాళ్ల కథలు, ప్రేమలు, లక్ష్యాలు, తింగరితనం.. ఇవన్నీ కలిపి సినిమాలు చేస్తున్నారు. ఈవారం విడుదల కాబోయే 'మేం ఫేమస్' అలాంటి కథే. ఇప్పుడు `పరేషాన్` కూడా ఈ జాబితాలో చేరుతుందేమో అనిపిస్తోంది. 'మసూధ'తో ఓ హిట్టు అందుకొన్న హీరో తిరువీర్. ఇప్పుడు `పరేషాన్` సినిమా చేశాడు. ఈ సినిమాపై అటెన్షన్ పెరగడానికి కారణం.. పోస్టర్ పై రానా పేరు ఉండడం. ఈ చిత్రానికి తాను సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. తనకు నచ్చిన కథలు వచ్చినప్పుడు ఆ సినిమా ప్రమోషన్ బాధ్యతని నెత్తిమీద వేసుకొని, జనంలోకి తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేస్తున్నాడు రానా. ఇప్పుడు `పరేషాన్`తో మరోసారి చిన్న సినిమాని ప్రమోట్ చేయడానికి రంగంలోకి దిగాడు.
ట్రైలర్ ఈరోజే విడుదలైంది. ముగ్గురి స్నేహితుల కథ ఇది. తెలంగాణ నేపథ్యంలో సాగుతుంది. కాకపోతే... ఈసారి హిందూ అమ్మాయి - క్రైస్తవ అబ్బాయి మధ్య లవ్ స్టోరీని నడిపారు. సన్నివేశాలు, సంభాషణలు అత్యంత సహజంగా ఉన్నాయి. తిరువీర్.. పక్కింటి అబ్బాయి పాత్రలో జీవించేసినట్టే కనిపిస్తోంది. తెరపై ఉన్నవాళ్లంతా.. కొత్త వాళ్లే. వాళ్లతోనే దర్శకుడు రూపక్ రొనాల్డ్ సన్ మంచి అవుట్ పుట్ తీసుకొచ్చాడు. ఫన్ తో పాటు ఈ సినిమాలో థ్రిల్ ఇచ్చే విషయాలూ చాలానే ఉన్నాయని అనిపిస్తోంది. చిన్న పాయింట్లతో సినిమాలు తీసినా... ఫన్ ఇస్తే చాలు. జనాలు ఆదరిస్తున్నారు. ఈ ఫార్మెట్ లోనే పరేషాన్ రూపొందించారు. మరి ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజుల ఆగాలి.