మిర్చి... ప్రభాస్ కెరీర్లో మరో సూపర్ హిట్. ఈ సినిమాతోనే రచయిత కొరటాల శివ దర్శకుడిగా అవతారం ఎత్తాడు. తొలి సినిమాతోనే అదరగొట్టి, టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. ఇప్పుడు కొరటాల రేంజ్.. 20 కోట్లు. ఎన్టీఆర్, మహేష్ లాంటి టాప్ హీరోలతో పనిచేసి, ఇప్పుడు మెగా స్టార్తో జట్టు కట్టాడు. అయితే.. మిర్చి తరవాత ప్రభాస్తో మరో సినిమా చేయలేదు. ఇప్పుడు మాత్రం ఆ ఛాన్స్ కొరటాల తలుపు తట్టినట్టు టాక్. ఈ మిర్చి కాంబో మరోసారి తెరపై రాబోతున్నట్టు సమాచారం అందుతోంది.
ఇటీవల ప్రభాస్ - కొరటాల మధ్య భేటీ జరిగిందట. ఈ భేటీలో కొన్ని కథలు ప్రస్తావనకు వచ్చాయని, అందులో ఓ కథ ప్రభాస్కి బాగా నచ్చిందని, ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే ఛాన్సుందని తెలుస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తరవాత ప్రభాస్ ఎవరి దర్శకత్వంలో నటిస్తాడన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. బహుశా.. కొరటాల శివ గనుక కథ రెడీ చేసుకుంటే, ఈ మిర్చీ కాంబోని అతి తొందరలో చూసేయొచ్చన్నమాట.