స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ తరహాలోనే డిజిటల్ స్క్రీన్ పైనా స్టార్స్ ఓ కన్నేసి ఉంచుతున్నారు. అవకాశం చిక్కితే చాలు అక్కడా అల్లుకుపోతున్నారు. ఒకప్పుడు ఎక్కడా అవకాశాల్లేక, డిజిటల్ ప్లాట్ఫామ్లో చిన్నా చితకా అవకాశాల కోసం వెంపర్లాడే నటీ నటులే కనిపించేవారు. కానీ కాలం మారింది. భవిష్యత్తు అంతా డిజిటల్ ప్లాట్ఫామ్ పైనే బేస్ అయ్యేలా ఉంది. ఇది ముందే గమనించిన మన స్టార్స్ అక్కడా తమ స్థానాన్ని పదిలం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టాలీవుడ్ విషయానికొస్తే, సమంత, రమ్యకృష్ణ తదితర స్టార్ హీరోయిన్లు డిజిటల్ ప్లాట్ఫామ్పై ఆల్రెడీ సత్తా చాటుతున్నారు.
ఇక బాలీవుడ్లో ప్రియాంకా చోప్రా వంటి గ్లోబల్ స్టార్స్ కూడా వెబ్ సిరీస్లపై అమితమైన ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ దారిలోనే సోషల్ మీడియా హాట్ సెన్సేషన్ రాయ్ లక్ష్మి కూడా అడుగులు వేస్తోంది. లేటెస్ట్గా బాలీవుడ్లో ఓ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ని పట్టేసింది. గతంలో విజయవంతమైన 'పాయిజన్' వెబ్ సిరీస్ రెండో భాగంలో మన రత్తాలు ఛాన్స్ కొట్టేసింది.
ప్రేమ - ప్రతీకారం నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఏప్రిల్ నుండి జీ 5 ఛానెల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. బాలీవుడ్ నటుడు అఫ్తాబ్ శివ దాసాని ఈ సిరీస్లో హీరోగా నటిస్తున్నాడు. లేటెస్ట్గా విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఫస్ట్లుక్లో హీరోతో కలిసి మన రాయ్ లక్ష్మి బుసలు కొడుతున్న రొమాంటిక్ స్టిల్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది.