ఒకే ఇండస్ట్రీలోని టాప్ సూపర్ స్టార్ లుగా ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు రాజకీయంగా ఒకటైతే ఆ ప్రభావం స్టేట్ మీద ఖచ్చితంగా ఉంటుంది. గతంలో కలిసి మల్టీ స్టారర్ లు చేసిన వీరిద్దరూ, ఇప్పుడు కలిసి రాజకీయంగా ఎదిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే కమల్ హాసన్, రజిని కాంత్ ఎన్నో సంవత్సరాలనుండి తమిళ వెండితెరను ఏలుతున్న హీరోలు. దాదాపు ఒకే సమయంలో కెరీర్ ఆరంభించిన ఈ ఇద్దరు కలిసి డజనుకు పైగా సినిమాలలో నటించారు. హీరోలుగా కలిసి ఎదిగిన వీరు, ఇప్పుడు రాజకీయంగా కూడా కలిసి ఎదగాలని చూస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే గతకొన్ని రోజులుగా కమల్ హాసన్, రజిని అనేక కార్యక్రమాలలో కలిసి కనిపిస్తున్నారు.
కమల్ హాసన్ కి చెందిన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ నూతన భవనం ఎదురుగా వీరిద్దరి గురువుగారైన కె బాలచందర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరూ, కమల్ 60ఏళ్ల సినీ వేడుకలో కూడా రజిని హాజరై సందడి చేశారు. తాజాగా రజిని ఇంటికి స్వయంగా కమల్ వెళ్లాడట. పైగా రానున్న ఎన్నికలలో కలిసి పనిచేస్తారా అని మీడియా అడుగగా... ఇద్దరు సానుకూలంగా స్పందించారు. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి.
ప్రధాన పార్టీలైన అన్నా డీఎంకే, డీఎంకే మునుపటిలా పటిష్టంగా లేవు. జయలలిత, కరుణా నిధి మరణం వలన ఈ రెండు పార్టీలు గతంలోలా శాసించే స్థాయిలో లేవనే చెప్పాలి. రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి ఇదే సరైన సమయం అని కమల్, రజిని భావిస్తున్నారని తమిళ్ మీడియా రాసుకోస్తుంది. వేరువేరుగా వెళ్లి పరాజయం పొందడం కంటే సమిష్టిగా పనిచేస్తే సీఎం కుర్చీ అందుకోవడం అంత కష్టమైన పని కాదు అని వీరి ఆలోచనగా తోస్తుంది. మరి చూడాలి ఏమి జరుగుతుందో.