లాక్ డౌన్ తో దేశం అతలాకుతలం అయిపోతోంది. ముఖ్యంగా పేదవాళ్ల బతుకులు మరీ హీనంగా తయారయ్యాయి. రెక్కాడితే గానీ, డొక్కాడని జీవితాలు ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నాయి. వీళ్లని ఆదుకోవడానికి సినీ తారలు తమదైన శైలిలో ముందుకొస్తున్నారు. ఇప్పటికే కథానాయకులు భారీగా విరాళాలు ప్రకటించారు. నిన్నా మొన్నటి వరకూ కామ్ గా ఉన్న కథానాయికలూ.. తలో చేయి వేస్తున్నారు. అందులో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ తన ఇంటి సమీపంలో ఉన్న మురికివాడలోని పేదల ఆకలి తీర్చడానికి ప్రయత్నిస్తోంది.
లాక్ డౌన్ ఎత్తేసే వరకూ దాదాపు 200 కుటుంబాలకు రెండు పూటలా భోజనం అందిస్తోంది. ఇప్పుడు ఓ యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. ఇందులో కొత్త కొత్త వీడియోలను పోస్ట్ చేయబోతోంది. ఈ యూ ట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి అందించబోతోందట. ఆ వీడియోల ద్వారా ప్రజలకు అవసరమైన విషయాలు చెబుతూనే, కొత్త కొత్త వంటల్ని పరిచయం చేయబోతోందట. ఇది మంచి ఐడియా కదూ..!