కోలీవుడ్‌ని టార్గెట్‌ చేసిన రకుల్‌

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి గతేడాది నుండీ ఇక్కడ చుక్కెదురైంది. 'రారండోయ్‌ వేడుక చూద్దాం' తర్వాత రకుల్‌ బాలీవుడ్‌లో అడుగు పెట్టడం, తర్వాత, టాలీవుడ్‌ నుండి ఆమెకు పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో ఇక్కడ అంతా ఈ ముద్దుగుమ్మని దాదాపు మర్చిపోయారు. 

'భ్రమరాంబ'గా రారండోయ్‌..సినిమాలో తెగ హడావిడి చేసేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, తర్వాత 'అయ్యారీ' సినిమాతో బాలీవుడ్‌పై గంపెడు ఆశలు పెట్టుకుంది. కానీ అక్కడ అమ్మడి అందచందాలకు, టాలెంట్‌కీ అస్సలు గుర్తింపు దక్కకపోవడంతో, టాలీవుడ్‌కి మళ్లీ తిరిగొచ్చేయాలనుకుంది. కానీ ఇక్కడ ఆఫర్లు దక్కలేదు. దాంతో కోలీవుడ్‌పై కన్నేసి, అక్కడే పాగా వేసేసింది. కోలీవుడ్‌లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ, బిజీగా గడుపుతోంది. అడపాదడపా తాను టాలీవుడ్‌ని మర్చిపోలేదని చెప్పుకొస్తోంది. 

కానీ టాలీవుడ్‌ మాత్రం మెల్ల మెల్లగా ఈ భామని మర్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఇకపోతే, రకుల్‌ కోలీవుడ్‌ ఎంట్రీ విషయానికి వస్తే, ఆల్రెడీ కార్తీతో 'ఖాకీ' చిత్రంలో నటించిన రకుల్‌ మరోసారి కార్తితోనే జత కట్టే ఛాన్స్‌ దక్కించుకుంది. తర్వాత కార్తి సోదరుడు సూర్య సరసన ఓ సినిమాలో ఆఫర్‌ కొట్టేసింది. సెల్వ రాఘవన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

కాగా, 'రెమో' సినిమాతో తెలుగు ఆడియన్స్‌లో కూడా క్రేజ్‌ సంపాదించుకున్న శివ కార్తికేయన్‌ సినిమాలో హీరోయిన్‌గా రకుల్‌ తాజా ఆఫర్‌ చేజిక్కించుకుంది. ఈ సినిమాని ఆర్‌. రవికుమార్‌ తెరకెక్కిస్తుండగా, ఏ.ఆర్‌.రెహమాన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే, రకుల్‌ ఇప్పట్లో ఇక తెలుగులో అడుగు పెట్టే అవకాశాలు కనిపించడం లేదనిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS