పాత సినిమాల్లోని సూపర్ హిట్ పాటల్ని, మళ్లీ ఈనాటి శ్రోతలకు వినిపించడం కోసం రీమిక్స్ని ఆశ్రయిస్తుంటారు దర్శకులు. థియేటర్లో ఓ జోష్ తీసుకురావడానికి, ఆ పాత జ్ఞాపకాలు తట్టిలేపడానికి ఈ పాటలు చాలా ఉపయోగపడతాయి. పైగా ఇనిస్టెంట్ హిట్లు అయిపోతాయి. అందుకే... రీమిక్స్ల హవా నడుస్తోంది. ఇటీవల 'అమిగోస్'లో బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్ 'ఎన్నో రాత్రులొస్తాయి కానీ' పాటని రీమిక్స్ చేశారు. సినిమా సరిగా ఆడలేదు కానీ, ఆ పాటకు మాత్రం మంచి ఆదరణ దక్కింది. సినిమాలోని ప్లస్ పాయింట్స్లలో అదొకటిగా నిలిచింది.
ఇప్పుడు రవితేజ సినిమా 'రావణాసుర'లో సూర్య ఐపీఎస్లోని 'ఇరవై ఒక్క జిల్లా వరకూ వింటున్నాను నీ కీర్తినే' పాటని రీమిక్స్ చేశారు. వెంకటేష్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఇళయరాజా సంగీతం అందించారు. సిరివెన్నెల సాహిత్యం సమకూర్చారు. అప్పట్లో యువతరాన్ని ఊపేసిన పాట ఇది. మంచి టీజింగ్ సాంగ్. ట్యూను బాగుంటుంది. సిరివెన్నెలలోని సాహిత్యంలో చమత్కారం ఉంటుంది. బాలు పాడిన విధానం గురించి చెప్పక్కర్లెద్దు. అయితే ఆ మ్యాజిక్ ఇప్పుడు రీ క్రియేట్ అవ్వలేదు. పాట.. ఏదోలా ఉంది. ట్యూను ఇష్టమొచ్చినట్టు మార్చేశారు. గాయకుడి టోన్ కూడా కుదరలేదు. ఈమధ్య కాలంలో.. ఓ రీమిక్స్ పాటకు ఇంత బ్యాడ్ రివ్యూలు రాలేదు. పైగా ఇళయరాజా అభిమానులు సైతం `ఇదేం రీమిక్స్ రా బాబూ` అంటూ ట్రోల్ చేయడం మొదలెట్టారు. `రావణాసుర` కి ఇది మంచి సంకేతం కాదేమో..?