'ఎవరు' సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ముద్దుగుమ్మ రెజీనా మరోసారి తన పర్ఫామెన్స్ చూపించేందుకు సిద్ధమవుతోంది. 'ఎవరు' కోసం క్రిమినల్ అవతారమెత్తిన రెజీనా, ఇప్పుడు మరో కొత్త సినిమాకి సైన్ చేసింది. ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకుడు. 'సామిరారా', 'కేశవ', 'రణరంగం' వంటి విలక్షణ సినిమాలను తెరకెక్కించిన సుధీర్ వర్మ ఈ సారి ట్రాక్ మార్చి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. రెజీనాతో పాటు ఈ సినిమాలో 'జెంటిల్మెన్' బ్యూటీ నివేదా థామస్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇద్దరూ పోలీసాఫీసర్ పాత్రల్లోనే కనిపించనున్నారనీ తెలుస్తోంది.
థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాని రూపొందించనున్నారట. సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో రివీల్ కానున్నాయి. ఇకపోతే రెజీనా చేతిలో ప్రస్తుతం చాలానే తమిళ సినిమాలున్నాయి. తెలుగులో మంచి కథల కోసం ఎదురు చూస్తోంది. మరో భామ నివేదా థామస్ ఈ సంక్రాంతికి 'దర్బార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'దర్బార్'లో సూపర్ స్టార్ రజనీకాంత్కి కూతురుగా కనిపించి మెప్పించింది. తెలుగులో నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న 'వి' చిత్రంలో నటిస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.