ప్రభాస్ సరసన ‘మిర్చి’ సినిమాలో నటించిన రిచా గంగోపాధ్యాయ్ గుర్తుందా.? ఈ ఎన్నారై బ్యూటీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా నటించిన ‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘మిరపకాయ్’ సినిమాలోనూ, ఇంకొన్ని సినిమాల్లోనూ నటించింది. కొన్ని తమిళ సినిమాలూ చేసింది ఈ బెంగాలీ బ్యూటీ. కానీ, సరైన సక్సెస్లు రాకపోవడంతో, తిరిగి అమెరికా చెక్కేసింది. ఉన్నత విద్య పూర్తి చేసి, ఈ మధ్యనే వైవాహిక జీవితంలోకి కూడా అడుగు పెట్టింది.
ప్రస్తుతం తన భర్తతో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోన్న ఈ బ్యూటీ, మళ్ళీ సినిమాల్లోకి రావాలని అనుకుంటోందట. నిజానికి, సినిమాల్లో మళ్ళీ నటించాలనే ఆలోచన ఆమెకు లేకపోయినా, అభిమానులు పదే పదే విజ్ఞప్తి చేయడంతో సినిమాలు చేయాలన్న దిశగా కసరత్తులు ముమ్మరం చేసిందట. పెళ్ళయ్యాక కూడా చాలామంది హీరోయిన్లు సినీ రంగంలో కొనసాగుతుండడం, పైగా పెళ్ళయ్యాక మరింత జోరు పెంచుతుండడంతో.. ఆ దిశగా రిచా గంగోపాధ్యాయ్ కూడా వడివడిగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ తమిళ నిర్మాత నుంచి రిచా గంగోపాధ్యాయ్కి ఆఫర్ వెళ్ళిందట.
అయితే, సినిమాల్లో నటించడానికి కాస్త సమయం పడుతుందని ఆమె సదరు నిర్మాతకు చెప్పినట్లు తెలుస్తోంది. ఏమో, మళ్ళీ ఈ భామ తెలుగు సినిమాల్లోనూ కన్పిస్తుందేమో వేచి చూడాలి.