అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయినట్టు చిరు వెల్లడించారు. ఈ రోజు సాయితేజ్ పుట్టినరోజుని పురస్కరించుకుని ట్విటర్ వేదికగా ఆయన విషెస్ చెప్పారు. ‘విజయదశమి మాత్రమే కాకుండా మా ఇంట్లో ఈరోజు మరో అనందం. యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన సాయితేజ్ చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యంతో నేడు ఇంటికి వచ్చేశాడు. ఇది తనకి పునర్జన్మ లాంటింది. మా కుటుంబం మొత్తానికి ఎంతో ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్డే సాయి తేజ్’..’’ ట్వీట్ చేశారు చిరంజీవి.
సెప్టెంబర్ 10 న సాయి ధరమ్తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో జరిగిన ప్రమాదంలో తేజ్ తన స్పోర్ట్స్ బైక్ నుంచి కిందకు పడిపోయారు. తీవ్ర గాయాలైన ఆయన్ని అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. మొత్తానికి తేజ్ క్షేమంగా ఇంటికి చేరడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.