'మన్మధుడు 2' సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా విడుదలకు ముందు నుంచీ విమర్శల్ని ఎదుర్కొంది. అడల్ట్ కంటెంట్ అనే అనుమానాలున్నాయి. అయితే, సినిమా విడుదలయ్యాక ఆ అనుమానాలకు నివృత్తి లభించింది. అనుమానం నిజమైంది. సినిమా అడల్ట్ కంటెంట్ మూవీ లిస్టులోకి పక్కాగా చేరిపోయింది. కంటెంటే కాదు, డబుల్ మీనింగ్ డైలాగులు, జుగుప్సాకరమైన సన్నివేశాలు ఈ సినిమాని డైరెక్ట్గా తీసుకెళ్లి ఆ లిస్టులో నిటారుగా నిలబెట్టేశాయి మరి. ఇదంతా ప్రేక్షకుని దృష్టి కోణం నుండి చూసింది మాత్రమే.
ఇక ఈ సంగతి పక్కన పెడితే, అక్కినేని కోడలు సమంత గురించి సరదాగా కాసేపు మాట్లాడుకుందామే. ఎలాగంటే, 'మన్మధుడు 2'లో సమంత గెస్ట్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. అయితే, గెస్ట్ కదా.. టీజర్, ట్రైలర్స్లో ఆమె పాత్రను సస్పెన్స్గా ఉంచారు సరే, కానీ, ప్రమోషన్స్లో ఒక్కసారి అయినా సమంత పాల్గొని ఉండాలి కదా. కానీ, ఎక్కడా కనిపించలేదు సమంత. కనీసం సినిమా రిలీజ్ ముచ్చట ఒక్క ట్వీట్లో అయినా ప్రస్థావించలేదు.
జస్ట్ గెస్ట్ రోల్ పోషించిందనే కాదు, సినిమాకి సంబంధించి, డైరెక్టర్ రాహుల్ కావచ్చు, ఆయన భార్య చిన్మయి కావచ్చు, హీరోయిన్ రకుల్ ప్రీత్, కీర్తిసురేష్.. ఇలా ఎవర్ని తీసుకున్నా అందరూ సమంతకు మంచి స్నేహితులే. ఇక అన్నింటికీ మించి తన ఫ్యామిలీ మూవీ. మామ నాగార్జున మూవీ. ఇన్ని లింకులున్న ఈ సినిమాని సమంత ఎందుకు పట్టించుకోలేదు. పలు ఇంటర్వ్యూస్లో సమంతకు ట్రైలర్ నచ్చలేదు.. అని నాగ్ చెప్పారు. అంటే సమంతకు విషయం ముందే అర్ధమైపోయిందనుకోవాలా.? ఏమో అలాగే అనిపిస్తోంది.