'పద్మావత్‌' ఆవేదన: పసిపిల్లలపైనా ప్రతాపమా?

మరిన్ని వార్తలు

'సినిమాని వ్యతిరేకించండి, ప్రశ్నించండి, అవసరమనుకుంటే కోర్టుకు వెళ్ళండి. అంతేగానీ, విధ్వంసాలకు దిగొద్దు' అని 'పద్మావత్‌' టీమ్‌ విజ్ఞప్తి చేస్తోంది. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ సహా పలు రాష్ట్రాల్లో 'పద్మావత్‌' సినిమాకి వ్యతిరేకంగా ఆందోళనలు భగ్గుమంటున్నాయి. ఆందోళనకారులు ఒళ్ళు మరిచిపోయి విధ్వంసాలకు దిగుతున్నారు. 

ఓ బస్‌పై ఆందోళనకారులు దాడి చేయడంతో, అందులోని చిన్నారులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలరచేతపట్టుకున్న ఘటన వెలుగు చూసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దాంతో 'పద్మావత్‌' టీమ్‌ సభ్యులు, ఇలాంటి దారుణాల్ని ప్రభుత్వాలు నియంత్రించలేకపోవడం శోచనీయమని విమర్శించారు. 'పద్మావత్‌' ఓ మంచి సినిమా అనీ, నిరసనకారుల అభ్యంతరాలతో సినిమాలోని కంటెంట్‌ని కొంతవరకు తొలగించి, సినిమాని సెన్సార్‌కి పంపించామనీ, సెన్సార్‌ క్లియరెన్స్‌ వచ్చిన తర్వాత కూడా ఆ విధ్వంసాలు దురదృష్టకరమని వారంటున్నారు. 

హీరోయిన్‌ దీపికా పడుకొనే, ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌సింగ్‌ 'పద్మావత్‌' ఆందోళనలపై పెదవి విప్పారు. ఓ మంచి సినిమా అవుతుందనే ఆశతో, ఎంతో కష్టపడ్డామనీ, తమ కష్టానికి తగిన గుర్తింపు దక్కుతుందని భావిస్తే, ఈ సినిమా మీద ఇంత విషప్రచారం చేసి తమకు మానసిక క్షోభను మిగిల్చారనీ, 'పద్మావత్‌'పై ఎంత దాడి జరిగినా తట్టుకున్నామనీ, అయితే ఆ సినిమా పేరుతో విధ్వంసాలు చాలా బాధ కలిగిస్తున్నాయని అన్నారు. 

సినిమాలకి వివాదాలు కొత్త కాదు. అయితే కనీ వినీ ఎరుగని స్థాయిలో 'పద్మావత్‌' సినిమా చుట్టూ వివాదాలు మురుసురుకున్నాయి. ఆ వివాదాలు సైతం ఊహలకందని విధ్వంసాన్ని మిగుల్చుతున్నాయి. ఈ రోజు సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. సినిమా వచ్చాక అయినా వివాదాలు చల్లారతాయా? వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS