జక్కన్న రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి ఇంతవరకూ బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్ల పేర్లు మాత్రమే సందడి చేశాయి. ఈ జాబితాలోకి తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పేరు కూడా వచ్చి చేరింది. హాలీవుడ్ నుండి ఒలివియా మోరిస్, బాలీవుడ్ నుండి అలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్'లో టాలీవుడ్ నుండి ముద్దుగుమ్మ శ్రియ ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈయనకు జోడీగానే శ్రియను ఎంచుకున్నారట.
ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్యా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందనీ తెలుస్తోంది. గతంలో శ్రియ, రాజమౌళి తెరకెక్కించిన 'ఛత్రపతి' సినిమాలో నటించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అలాగే అజయ్ దేవగణ్ - శ్రియ జంటగా తెరకెక్కిన 'దృశ్యం' సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. సెంటిమెంట్ పరంగా చూస్తే శ్రియ ఎంపిక అందుకే జరిగిందేమో అనిపిస్తోంది. మరి శ్రియ పాత్ర ఈ సినిమాలో ఎలా ఉండబోతోందనే విషయంపై క్లారిటీ లేదు కానీ, మొత్తానికి శ్రియకు మంచి పాత్రే దక్కి ఉంటుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.
మరోవైపు తమిళ నటుడు సముద్రఖని ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో మెగా మల్టీ స్టారర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాని డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.