ప్రముఖ గాయని ఎస్. జానకి పై ఓ వార్త హల్ చల్ చేసింది. ఆమె ఇక లేరని కొన్ని వెబ్ సైట్లు, మీడియా సంస్థలు బ్రేకింగ్ న్యూస్లు వేసి, తరవాత నాలిక కరచుకున్నాయి. జానకి మరణించిందన్న వార్త తెలుసుకుని చిత్రసీమ షాక్కి గురైంది. ఆ తరవాత ఆమె క్షేమ సమచారం తెలుసుకుని ఊపిరి పీల్చుకుంది. జానకి క్షేమంగా ఉన్నారని, ఆమెపై ఆరోగ్యంపై వస్తున్న పుకార్లని నమ్మొద్దని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇటీవల జానకి కి ఓ పెద్ద ఆపరేషన్ జరిగింది. అనారోగ్యం నుంచి ఆమె పూర్తిగా కోలుకుంటున్నారు.
ఈ తరుణంలో ఇలాంటి వార్త రావడం బాధాకారం. నిజానికి.. జానకమ్మపై ఇలాంటి వార్తలు కొత్తేం కాదు. గత రెండేళ్ల నుంచి.. అప్పుడప్పుడూ ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. లెజెండరీ వ్యక్తుల గురించి వార్తలు రాసేటప్పుడూ, వాటినిప్రచురించేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని ఈ తాజా ఉదంతం మరోసారి గట్టిగా నొక్కి చెబుతోంది. మొత్తానికి జానకమ్మ క్షేమంగా ఉన్నారు. సంగీత అభిమానులకు అంతకంటే కావల్సింది ఏముంది?