భార్య విజయ నిర్మల పార్ధివ దేహాన్ని చూసి, సూపర్ స్టార్ కృష్ణ కన్నీరు మున్నీరయ్యారు. ఆయన్ని ఆపడం ఎవరి వల్లా కాలేకపోయింది. పార్వతీ, పరమేశ్వరుల్లా, ఏ ఈవెంట్కైనా నిండుగా హాజరయ్యే ఈ జంట ఇప్పుడు ఒంటరిదైపోయింది. కృష్ణను అలా చూస్తుంటే, ఆయన అభిమానుల గుండె తరుక్కుపోతోంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధపడుతున్న విజయనిర్మల ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రి నుండి, నానక్ రామ్ గూడలోని ఆమె స్వగృహానికి ఈ రోజు విజయనిర్మల పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు.
ఈ రోజంతా సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్ధం అక్కడే ఆమె భౌతకకాయాన్ని ఉంచనున్నారు. కుటుంబ సభ్యులు మహేష్బాబు, నమ్రతా, మంజుల, నరేష్ తదితరులు కృష్ణ పక్కనే ఉండి, ఆయనను ఓదార్చుతున్నారు. రేపు ఫిలిం ఛాంబర్లో కొంత సమయం ఉంచిన తర్వాత విజయ నిర్మల భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె హఠాన్మరణంతో ఈ రోజు జరగాల్సిన 'కల్కి' ప్రీ రిలీజ్ ఫంక్షన్ని వాయిదా వేశారు.
అలాగే రేపు జరగనున్న 'మహర్షి' 50 రోజుల సక్సెస్ ఈవెంట్ కూడా కాన్సిల్ చేశారు. సినీ ప్రముఖులే కాదు, వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, గల్లా జయదేవ్, తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తదితర రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.