'పెళ్లిచూపులు' సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నక్క తోక తొక్కినట్లున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు పిలిచి మరీ మనోడికి ఆఫర్ ఇచ్చాడట. అది కూడా సీనియర్ హీరో వెంకీతో సినిమా చేయాలని సూచించాడట. ఇంకేముంది మనోడి ఆనందానికి అవధుల్లేవ్. లేటెస్ట్గా తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన 'మీకు మాత్రమే చెప్తా' సినిమా ఓ రేంజ్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.
తనను హీరోగా పరిచయం చేసినందుకు కృతజ్ఞతగా విజయ్ దేవరకొండ స్వయంగా నిర్మాతగా మారి తరుణ్ని హీరోగా చేసి ఈ సినిమాని రూపొందించాడు. అలాగే ప్రమోషన్స్ కూడా విజయ్ దేవరకొండ రేంజ్లో ఊదరగొట్టేశారు. అయితే, విడుదలయ్యాక ఆడియన్స్ని ఎట్రాక్ట్ చేయడంలో ఈ సినిమా అంతగా మార్కులు కొట్టలేకపోయింది. కానీ, తరుణ్ భాస్కర్ హీరోగా ఫర్వాలేదనిపించాడు. అయితే, సురేష్బాబు ఇచ్చిన ఆఫర్తో తనలోని దర్శకుడికి మళ్లీ పని చెప్పాలనుకున్నాడట. వెంకీ కోసం అదిరిపోయే స్క్రిప్టు సిద్ధం చేస్తున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. మరి సీనియర్ హీరో వెంకీ, యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో రాబోయే ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోందో చూడాలిక.