అల.. వైకుంఠపురములో తో బాక్సాఫీసు దగ్గర తన స్టామినా ఏమిటో చూపించాడు అల్లు అర్జున్. టాలీవుడ్ టాప్ 2 లో ఈ సినిమా నిలబడిపోయింది. బాహుబలి 1 రికార్డులు బ్రేక్ చేసేసింది. కొన్ని చోట్ల బాహుబలి 2 (తెలుగు వెర్షన్) రికార్డులూ దాటేసిందని సినీ విశ్లేషకులు తేల్చేశారు. దీని తరవాత బన్నీ నుంచి వస్తున్న మరో చిత్రం `పుష్ష`. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. రష్మిక కథానాయిక. లాక్ డౌన్ లేకపోతే... ఈపాటికి కొంతమేర షూటింగ్ కూడా జరిగేది. కానీ.. లాక్ డౌన్ వల్ల కుదర్లేదు.
ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇందులో బన్నీ ఓ లారీ డ్రైవర్ గానటించబోతున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ ఇది. బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తుంటాడు. స్మగ్లింగ్ అంటే ఛేజింగులు తప్పని సరి. అలాంటి ఓ భారీ ఛేజ్ ఈ సినిమలో ఉందట. ముందు బన్నీ లారీ, వెనుక బోలెడన్ని పోలీసు వ్యాన్లతో భారీ ఛేజింగు. ఈ ఛేజ్ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాలని చిత్రబృందం భావిస్తోంది. సినిమాకి ఆయువు పట్టులాంటి యాక్షన్ సీక్వెన్స్ ఇదని, దాదాపు ఆరు నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా ఆరు కోట్లు ఖర్చు పెట్టడానికి చిత్రబృందం రెడీ అయ్యిందని తెలుస్తోంది. లాక్ డౌన్ ఎత్తి వేయగానే ఈ యాక్షన్ సీనే తెరకెక్కిస్తార్ట. పీటర్ హెయిన్స్ ఈ యాక్షన్ సీన్కి కొరియోగ్రఫీ చేయబోతున్నారు. మరి ఈ ఛేజింగ్ ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.