13 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సీనియర్ హీరోయిన్ విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు సూపర్స్టార్ మహేష్ సినిమాతో. విజయశాంతి ఎంట్రీతో ఈ సినిమాకి వెయిట్ బాగా పెరిగింది. ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఒప్పుకోని విజయశాంతి మహేష్ కోసం ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి 'సరిలేరు నీకెవ్వరు' అనే టైటిల్ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే, ఈ ఆఫర్తో విజయశాంతికి మరిన్ని ప్రాజెక్టులు క్యూ కట్టేస్తున్నాయట. ఇప్పటికే మరో రెండు ప్రాజెక్టులకు విజయశాంతి సైన్ చేసిందనీ తెలుస్తోంది. అవి కూడా బిగ్ ప్రాజెక్ట్సేనట. అందులో ఒకటి ఓ ప్రముఖ హీరో సినిమా అనీ తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి చేస్తానంటోంది విజయశాంతి. ప్రస్తుతం సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ కోసం స్పెషల్ రోల్స్ని సిద్ధం చేస్తున్నారు దర్శక, నిర్మాతలు.
ఆయా పాత్రల్లో ఇంతవరకూ నదియా, ఖుష్బూ, రమ్యకృష్ణ తదితరులు నటించి మెప్పించారు. ఈ మధ్యనే టబు కూడా రంగంలోకి దూకింది. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమాలో టబు కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా లేడీ సూపర్స్టార్ రంగంలోకి దూకడంతో, స్టోరీ రైటర్స్కి కొత్త ఉత్సాహం పుంజుకుంది. ఆమె కోసం కీలక పాత్రల్ని సిద్ధం చేసేందుకు మన రైటర్స్ జూలు విదుల్చుతున్నారు మరి.